- ప్రజలను చేరేందుకు సోషల్ మీడియాతోపాటు కొత్త వ్యూహాలు
- వందలమందితో ఒకేసారి టెలీకాన్ఫరెన్స్ పెట్టే ఆలోచన
- లక్షలు ఖర్చు చేసి రూపొందించుకుంటున్న అభ్యర్థులు
హైదరాబాద్, వెలుగు: ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ ఓటర్లకు దగ్గరవడానికి అభ్యర్థులు కొత్తదారులు వెతుకుతున్నారు. ఇప్పటిదాకా సోషల్ మీడియానే ప్రధాన ప్రచార అస్ర్తంగా ఎంచుకున్న అభ్యర్థులు, ఇప్పడు ఒక అడుగు ముందుకేసి పర్సనల్గా యాప్లను తయారు చేయించుకుంటున్నారు. ఈ యాప్స్ ఇదివరకు పార్టీలకే ఉండేవి, ఇప్పడు అభ్యర్థులు కూడా వీటిని వాడుతున్నారు. యాప్ కోసం లక్షల్లో ఖర్చు చేస్తున్న అభ్యర్థులు, దాని ద్వారా తమ సెగ్మెంట్ల ప్రజలకు దగ్గరవడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ యాప్లో అభ్యర్థుల ప్రాథమిక సమాచారంతో పాటు, నియోజకవర్గాలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని అప్డేట్ చేస్తున్నారు. ఓటర్ లిస్ట్ ను బూత్ స్థాయి నుంచి అప్డేట్ చేసి, ప్రతి వంద మందికి ఒక ఇన్చార్జీని నియమిస్తున్నారు. వీరి ద్వారా ఓటర్ల మనోగతాన్ని అంచనా వేసి, మచ్చిక చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.
బూత్స్థాయి నుంచి డేటా..
ఈ యాప్లను ప్రధానంగా రెండు ఇంటర్ఫేస్లతో రూపొందించారు. యూజర్ లాగిన్లో అభ్యర్థికి సంబంధించిన ప్రాథమిక సమాచారంతో పాటు ఓటర్లు తమ సమస్యలు చెప్పుకోవడానికి ఆప్షన్స్ ఇస్తున్నారు. అభ్యర్థి డైలీ షెడ్యూల్, లైవ్టీవీలు, బ్లడ్డొనేషన్ తదితరాలు ఉంటున్నాయి. అడ్మిన్ లాగిన్లో బూత్స్థాయి ఓటర్ల వివరాలను అందుబాటులో ఉంచుతున్నారు. దీని ఆధారంగా ప్రతి బూత్కు ప్రత్యేకంగా ఇన్చార్జిని నియమించుకుంటున్నారు. ఇన్చార్జిలు ఓటర్ల వివరాలు సేకరించి, తమకు అనుకూలంగా ఉండేవారా ? ప్రతికూలంగా ఉండేవారా? అని ఎంక్వేరీలు చేస్తారు. ఏయే బూత్లో ఎక్కువ శాతం మహిళలు, పురుషులు ఎటుపైపు ఉన్నారు? ఎక్కడ నష్టపోయే ప్రమాదం ఉందని ఇన్చార్జి యాప్లో అప్డేట్ చేస్తారు. ఆ డేటా ఆధారంగా ఇతర పార్టీలకు చెందిన ఓటర్లను గుర్తించి తమవైపు తిప్పుకోవడానికి అభ్యర్థులు ప్రయత్నిస్తున్నారు.
వందల మందితో టెలీకాన్ఫరెన్స్ సౌకర్యం
ఈ యాప్లో నియోజకవర్గంలోని మండలాలు, గ్రామాలు, బూత్ల వారీగా ఓటర్ల వివరాలను అప్డేట్ చేసి ఇస్తున్నారు. అలాగే ఓటర్ల ఫోన్ నంబర్లను కూడా అందుబాటులో ఉంచుతున్నారు. దీంతో అభ్యర్థులు వందల మంది ఓటర్లతో ఒకేసారి టెలీకాన్ఫరెన్స్ మాట్లాడే వీలు ఉంటుంది. అభ్యర్థులు ప్రతీ ఓటరుకు తాము చెప్పాలనుకున్నది టెలీకాన్ఫరెన్స్ ద్వారా ఈజీగా చెప్పేస్తున్నారు. ఈ యాప్లను రూపొందిస్తున్న ప్రైవేట్ సంస్థలు భారీ స్థాయిలో చార్జీలు వసూలు చేస్తున్నాయి. ఒక యాప్నకు సంవత్సరానికి 3 లక్షలు, ఐదేండ్లకు 8 లక్షల దాకా చార్జీలు వసూలు చేస్తున్నారు. అయితే బూత్ స్థాయి నుంచి ఓటర్ల వివరాలు, ఫోన్ నంబర్లు, టెలీకాన్ఫరెన్స్, ప్రభుత్వ స్కీమ్ అర్హుల వివరాలు తదితర సౌకర్యాలు ఉంటుండటంతో ఖర్చుకు వెనకాడకుండా అభ్యర్థులు తమకు కావాల్సినట్టుగా యాప్లు తయారు చేయించుకుం టున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా లో ఇప్పటికే ముగ్గురు అధికార పార్టీ అభ్యర్థులు యాప్లు తయారు చేయిం చుకొని ప్లేస్టోర్లో పెట్టారని తెలిసింది.