కామారెడ్డి జిల్లా లింగంపేటలో ఘటన.. వాటర్‌ట్యాంక్‌పై ప్రేమజంట హల్‌చల్‌

కామారెడ్డి జిల్లా లింగంపేటలో ఘటన.. వాటర్‌ట్యాంక్‌పై  ప్రేమజంట హల్‌చల్‌

లింగంపేట, వెలుగు : ఓ ప్రేమ జంట వాటర్‌ ట్యాంక్‌ ఎక్కి కొద్దిసేపు హల్‌చల్‌ చేశారు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా లింగంపేటలో సోమవారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే... సోమవారం ఉదయం 11 గంటలకు లింగంపేట ఎంపీడీవో ఆఫీస్‌ వెనుక వైపు ఉన్న వాటర్‌ ట్యాంక్‌ పైన ఓ యువతీయువకుడు తిరగడాన్ని స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్సై దీపక్‌ కుమార్‌ ట్యాంక్‌ వద్దకు చేరుకొని ఇద్దరినీ కిందికి దింపి అదుపులోకి తీసుకున్నారు. 

ట్యాంక్‌ ఎక్కిన యువకుడిది లింగంపేట మండలంలోని కన్నాపూర్‌ గ్రామం కాగా, యువతిది హైదరాబాద్‌గా గుర్తించినట్లు ఎస్సై తెలిపారు. ఇద్దరికీ కౌన్సిలింగ్‌ నిర్వహించిన అనంతరం బాలికను హైదరాబాద్‌కు పంపించినట్లు చెప్పారు. ప్రేమ విషయంలో ఇద్దరు మధ్య గొడవలు జరగడంతో ఆత్మహత్య చేసుకునేందుకు వాటర్‌ ట్యాంక్‌ ఎక్కి ఉంటారని స్థానికులు చర్చించుకుంటున్నారు.