- రాష్ట్ర ప్రభుత్వంపై హైకోర్టు అసంతృప్తి
- 15 రోజుల్లో వివరాలు ఇవ్వాలని ఆదేశం
- లేదంటే తీవ్రంగా పరిగణిస్తామని హెచ్చరిక
హైదరాబాద్, వెలుగు: టాలీవుడ్ డ్రగ్స్ కేసు వివరాలు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కు(ఈడీ) ఎందుకు ఇవ్వడం లేదని రాష్ట్ర ప్రభుత్వంపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. యువత దారి తప్పే అవకాశమున్న ఈ కేసులో ప్రభుత్వం ఉదాసీనంగా ఉండటానికి వీల్లేదని తేల్చి చెప్పింది. 15 రోజుల్లో ఈడీ కోరిన వివరాలన్నీ ఇవ్వాలని ఉత్తర్వులు జారీ చేసింది. డ్రగ్స్ కేసుకు సంబంధించిన వారి కాల్ డేటా రికార్డులను నెల రోజుల్లో అప్పగించాలని ఆదేశించింది. ఈ మేరకు చీఫ్ జస్టిస్ సతీశ్చంద్రశర్మ, జస్టిస్ అభినంద్కుమార్ షావిలి బెంచ్ బుధవారం ఉత్తర్వులిచ్చింది. టాలీవుడ్తో సంబంధాలు ఉన్న డ్రగ్స్ కేసు దర్యాప్తు మందకొడిగా సాగుతోందని 2017లో కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి దాఖలు చేసిన పిల్ను బుధవారం బెంచ్ మరోసారి విచారణ చేపట్టింది. దేశ ప్రయోజనాల దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం ఈడీ దర్యాప్తునకు సహకరించాలని తేల్చి చెప్పింది. ఈడీ దర్యాప్తు సరిపోతుందని, పిటిషనర్ కోరుతున్నట్లుగా సీబీఐ ఇతర దర్యాప్తు సంస్థలకు కేసును అప్పగించాల్సిన అవసరం లేదని పేర్కొంది. అయితే, రాష్ట్ర ఎక్సైజ్ డిపార్ట్మెంట్ డ్రగ్స్కేసు సమాచారం ఇవ్వకపోతే ఈడీ హైకోర్టుకు రావొచ్చని సూచించింది. కాగా ఈడీ జాయింట్ డైరెక్టర్ అభిషేక్ గోయల్ ఆన్లైన్లో విచారణకు హాజరయ్యారు. తమకు రాష్ట్ర ప్రభుత్వం డ్రగ్స్కేసు సమాచారం, డాక్యుమెంట్స్ ఇవ్వడం లేదన్నారు. రేవంత్ తరఫు న్యాయవాది రచనారెడ్డి వాదిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం ఈడీకి సహకరించడం లేదన్నారు. ఎక్సైజ్ అధికారులు వివరాలు ఇవ్వడం లేదన్నారు. కీలక వ్యక్తుల ప్రమేయం ఉన్న ఈ కేసులో రాష్ట్ర ప్రభుత్వ దర్యాప్తు మందకొడిగా ఉందన్నారు. గవర్నమెంట్ స్పెషల్ ప్లీడర్ వాదిస్తూ.. ఈడీ అడిగిన వివరాలన్నీ ఇచ్చామన్నారు. ఎఫ్ఐఆర్ ఇతర డాక్యుమెంట్స్ ఈడీతోపాటు కోర్టులకు కూడా ఇచ్చామన్నారు. వాదన విన్న కోర్టు ఎఫ్ఐఆర్లు, ఇతర పూర్తి వివరాలు ఈడీకి అప్పగించాలని, ఈడీ దర్యాప్తు అధికారులు కోరిన రికార్డులన్నీ ఇవ్వాలని, తమ ఆదేశాలను అమలు చేయకపోతే తీవ్రంగా పరిగణిస్తామని హెచ్చరిస్తూ పిల్పై విచారణ ముగించింది.