ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు
హైదరాబాద్, వెలుగు: ఆన్లైన్ లో టీచింగ్ పై ఇప్పటి వరకు ఏమైనా నిర్ణయం తీసుకున్నారా ? అని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. లేదంటే దీనికి సంబంధించి కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలని ప్రతివాదులైన చీఫ్ సెక్రటరీ, పాఠశాల విద్యా శాఖ డైరెక్టర్, తెలంగాణ రిజిస్టర్ స్కూల్ మేనేజిమెంట్ అసోసియేషన్లు, హైదరాబాద్, రంగారెడ్డి డీఈవోలను ఆదేశించింది. ఆన్లైన్ లో టీచింగ్ పై సర్కార్ విధాన నిర్ణయం ఏదైనా తెలుసుకుందో లేదో చెప్పాలని కోరింది. ఆన్లైన్ క్లాసెస్ నిర్వహిస్తూ టర్మ్ ఫీజు పేరుతో పలు ప్రైవేట్ విద్యా సంస్థలు విద్యార్థుల తల్లిదండ్రుల్ని దోచుకుంటున్నాయని, ఆన్లైన్ టీచింగ్ చేసే వారిపై చర్యలు తీసుకోవాలంటూ దాఖలైన పిల్ను చీఫ్ జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ విజయన్ రెడ్డిల డివిజన్ బెంచ్ బుధవారం విచారించింది.
ఈ సందర్భంగా ఆన్లైన్ టీచింగ్ పేరుతో ఫీజులు వసూలు చేసే వారిపై చర్యలు తీసుకోవాలంటూ డీఈవోలకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని ప్రభుత్వ ప్రత్యేక లాయర్ సంజీవ్కుమార్ కోర్టుకు తెలిపారు. ఐతే రెం డు, మూడు జిల్లాలు మినహా అన్నిజిల్లాలో ఆన్ లైన్ క్లాసెస్ నిర్వహిస్తున్నారంటూ పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అసలు ప్రైవేట్ స్కూళ్లలో ఆన్ లైన్ టీచింగ్ కు ప్రభుత్వం అనుమతించిందా లేదా కూడా చెప్పాలని కోర్టుకోరింది. పూర్తి వివరాలతో కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలని కోరుతూ విచారణను 8కి వాయిదా వేసింది.