హైదరాబాద్, వెలుగు : ఒక మతానికి చెందిన వాళ్లకు చట్ట వ్యతిరేక శిక్షణ ఇస్తున్నారంటూ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) నమోదు చేసిన కేసులో ఎనిమిది మంది నిందితులకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. నిషేధిత పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎఫ్ఐ) సభ్యులు మహ్మద్ అబ్దుల్ మోబీన్, షేక్ రహీం అలియాస్ అబ్దుల్ రహీం, షేక్ వహీద్ అలి అబ్దుల్ వహీద్, షేక్ ప్రలాబాన్, షేక్ ప్రొదుల్లా, మహ్మద్ ఉస్మా న్, ఫిరోజాన్, షేక్ రియాజ్ అహ్మదుల్లాకు బెయిల్ మంజూరు చేసింది. ఈ మేరకు జస్టిస్ కె.లక్ష్మణ్ బుధవారం ఉత్తర్వులు చేశారు.
కర్నూలు తదితర ప్రాంతాల్లో ఒక మతానికి చెందిన యువతకు శిక్షణ ఇచ్చారన్న ఆరోపణలతో నమోదైన కేసును ఎన్ఐఏ దర్యాప్తు చేస్తోంది. ముందుగా నిందితులకు బెయిల్ మంజూరు చేసేందుకు నాంపల్లి ఎన్ఐఏ కోర్టు నిరాకరించింది. దీంతో వాళ్లంతా వేర్వేరుగా అప్పీళ్లు దాఖలు చేయడంతో హైకోర్టులో బెయిల్ లభించింది. రూ.25 వేల వ్యక్తిగత బాండ్లతో పాటు అంతే మొత్తానికి మరో ఇద్దరి పూచీకత్తులు సమర్పించాలని, తిరిగి ఉత్తర్వులు జారీ చేసేదాకా సంబంధిత పోలీసు స్టేషన్లలో ప్రతి శుక్రవారం హాజరు కావాలని షరతులు విధిస్తూ జడ్జి బెయిల్ మంజూరు చేశారు.