రూ. 500 కోట్లు ఎవరికి ఇచ్చారు.. వరద సాయంపై సర్కారుకు హైకోర్టు ప్రశ్న

రూ. 500 కోట్లు ఎవరికి ఇచ్చారు.. వరద సాయంపై సర్కారుకు హైకోర్టు ప్రశ్న

రాష్ట్రంలో సంభవించిన వర్షాలు, వరదలపై దాఖలైన పిటీషన్ పై హైకోర్టు  విచారించింది. రాష్ట్రంలో వరదలు, వర్షాలపై ప్రభుత్వం రెండో సారి నివేదికను  హైకోర్టుకు అందజేసింది. ఈ నివేదికలో  వరదల ప్రభావంతో 49 మంది మృతి చెందినట్లు ప్రభుత్వం  పేర్కొంది. అంతేకాకుండా వరద బాధితులకు పునరావాసం కోసం  రూ.500 కోట్లు కేటాయించినట్లు వెల్లడించింది. 

మళ్లీ అసంపూర్తిగానే..

వరదలు, వర్షాలపై రెండో సారి ప్రభుత్వం దాఖలు చేసిన నివేదిక కూడా అసంపూర్తిగా ఉందని పిటిషనర్ తరుపు న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ హైకోర్టులో వాదనలు వినిపించారు. వరద ప్రభావం, నష్టంపై మరో నివేదిక మోమోను న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ కోర్టుకు సమర్పించారు. అయితే పిటీషనర్ వాదనను ఏకీభవించిన హైకోర్టు.. రూ.500 కోట్లు ఎవరికి ఎంత పరిహారం ఇచ్చారో నివేదికలో ఎందుకు లేదని హైకోర్టు ప్రశ్నించింది. రూ.500 కోట్లు ఎలా ఖర్చు చేశారో పూర్తి వివరాలతో సమగ్ర నివేదిక ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అంటువ్యాధులతో బాధపడుతున్న వారి విషయంలో ఎలాంటి చర్యలు తీసుకున్నారో నివేదికలో తెలపాలని ఆదేశించింది. చనిపోయిన 49 మందికి ఎంత నష్ట పరిహారం చెల్లించారో సమగ్ర నివేదిక సమర్పించాలని తెలిపింది. ఈ కేసుకు సంబంధించి తదుపరి విచారణను హైకోర్టు వచ్చే ఆగష్టు 17కు  వాయిదా వేసింది.