- సంబంధిత అధికారులకు కోర్టు నోటీసులు
- రైతుల పంట పొలాల్లో పీసీబీ శాంపిల్స్ సేకరణ
షాద్ నగర్,వెలుగు : రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పరిధి ఎలికట్ట గ్రామ శివారు ప్రాంతాలు కాలుష్యం కోరల్లో చిక్కాయి. ఇక్కడ పంటలు పండవని అగ్రికల్చర్ అధికారులు ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా హైకోర్టు న్యాయవాది కె. నరసింహారావు పిటిషన్ దాఖలు చేశారు. దీంతో హై కోర్టు సంబంధిత అధికారులకు నోటీసులు జారీ చేస్తూ నాలుగు వారాలకు వాయిదా వేసింది. కాగా.. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు మంగళవారం ఎలికట్ట గ్రామ శివారులోని రైతుల పంట పొలాలను పరిశీలించారు.
అసిస్టెంట్ ఎన్విరాన్ మెంట్ సైంటిస్ట్ విద్యుల్లత బోరు మోటారు ద్వారా వచ్చే నీటి శాంపిల్స్ సేకరించారు. పరిశ్రమలు వదిలే కెమికల్స్ తో పంటలు నష్టపోతున్నామని, అనారోగ్యాల బారిన పడుతున్నామని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులతో పాటు సంబంధిత శాఖ అధికారులకు రైతులు ఫిర్యాదులు చేశారు. అయినా ఎవరూ పట్టించుకోకపోవడంతో ఫెడరేషన్ ఆఫ్ యంగ్ పీపుల్ స్వచ్ఛంద సంస్థ హైకోర్టును ఆశ్రయించింది.