
హైదరాబాద్, వెలుగు: కొత్త అసెంబ్లీ నిర్మాణం కోసం ఎర్రమంజిల్లోని ప్రభుత్వ భవనాన్ని కూల్చేసే విషయంలో ప్రభుత్వ వైఖరి చెప్పాలంటూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆర్అండ్ బీ ముఖ్యకార్యదర్శి, లా సెక్రటరీ, బల్దియా కమిషనర్లకు శుక్రవారం హైకోర్టు నోటీసులు జారీచేసింది. ఎర్రమంజిల్ భవనాన్ని 1870లో కట్టారని, దీనిని కూల్చకుండా మధ్యంతర ఆదేశాలివ్వాలని కోరుతూ ప్రొఫెసర్ విశ్వేశ్వరరావు దాఖలు చేసిన ప్రజాప్రయోజనవ్యాజ్యాన్ని సీజే జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ షమీమ్ అక్తర్లతో కూడిన డివిజన్బెంచ్ శుక్రవారం విచారించింది.
కరీంనగర్ కూల్చివేతలపై సారీ చెప్పిన ఐఏఎస్
కరీంనగర్ సిటీలో రోడ్డు విస్తరణలో దుకాణాల్ని కోల్పోయిన యజమానులకు తక్షణమే పరిహారం చెల్లిస్తామని కరీంనగర్ బల్దియా మాజీ కమిషనర్, ఐఏఎస్ అధికారి కె.శశాంక్ శుక్రవారం హైకోర్టుకు చెప్పారు. ఈ కేసుకు సంబంధించి ఆయన క్షమాపణలు కోరారు. కోర్టు ఆదేశాల్ని అమలుపర్చడంలో విఫలమైన ఆయనకు గతంలో సింగిల్ జడ్జి.. ఒక నెల జైలు, రూ.25వేల ఫైన్ వేశారు. ఆ తీర్పుపై శశాంక్ చేసుకున్న అప్పీల్ పిటిషన్ను హైకోర్టు శుక్రవారం విచారించింది. జైలు శిక్షపై 3 నెలల స్టే విధించింది.