- రంగనాయక స్వామి ఆలయ భూములపై విచారణ
- కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశం
- ఆలయ భూములను మ్యుటేషన్ చేయించుకున్నారని ఆరోపణలు
హైదరాబాద్, వెలుగు: పెద్దపల్లి జిల్లా ముత్తారం ధర్మాబాద్ పంచాయతీ పరిధిలోని రంగనాయ క స్వామి ఆలయ భూముల వ్యవహారంలో ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డికి గురువారం హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఆలయ భూములను మనోహర్ రెడ్డి చట్ట వ్యతిరేకంగా మ్యుటేషన్ చేయించుకున్నారని పెద్దపల్లి మండలం చందపల్లికి చెందిన జాపతి రాజశేఖర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీన్ని జస్టిస్ బి.విజయ్సేన్ రెడ్డి విచారించారు.
ఆలయ భూములను తన పేరు మీద చేయించు కుని దేవుడికే అన్యాయం చేస్తున్నారంటూ పిటిషనర్ పేర్కొన్నారు. వాదనలు విన్న జడ్జి.. ఎమ్మెల్యేతో పాటు రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి, దేవాదాయ శాఖ కమిషనర్, పెద్దపల్లి కలెక్టర్, ఆర్డీవో, తహసీల్దార్, ముత్తారం ధర్మాబాద్లోని రంగనాయక స్వామి ఆలయ ఈవోలకు నోటీసులు జారీ చేశారు. కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించారు.