హైదరాబాద్, వెలుగు : 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్ ఎమ్మెల్యేగా గంగుల కమలాకర్ ఎన్నిక చట్టవిరుద్ధమని ప్రకటించాలంటూ బండి సంజయ్ దాఖలు చేసిన ఎలక్షన్ పిటిషన్ను హైకోర్టు విచారించింది. కోర్టు కమిషనర్ ఎదుట సంజయ్ హాజరై సాక్ష్యం ఇవ్వాలని, లేకపోతే పిటిషన్ను మూసేస్తామని స్పష్టం చేసింది.
కేంద్ర మంత్రిగా బాధ్యతలు తీసుకున్న కారణంగా సంజయ్ బిజీగా ఉన్నారని, కోర్టు కమిషనర్ ముందు హాజరయ్యేందుకు గడువు కావాలని ఆయన తరఫు అడ్వకేట్ హైకోర్టును కోరారు. వీలైనంత త్వరగా హాజరై సాక్ష్యం చెప్పాలని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను జులై 8కి వాయిదా వేసింది.