హైదరాబాద్, వెలుగు: తెలంగాణ పబ్లిక్ సర్వీసెస్ కమిషన్లో మెంబర్లను చట్టవిరుద్ధంగా నియమించారని దాఖలైన కేసులో కౌంటర్ వేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. కౌంటర్ వేయాలని గతంలోనే ఆదేశాలిచ్చినా వేయకపోవడంపై ఫైర్ అయింది. ఇదే చివరి అవకాశం అని తేల్చి చెప్పింది. అర్హతలు లేకపోయినా కొందరిని కమిషన్ మెంబర్స్గా నియమించారని పేర్కొంటూ ప్రొఫెసర్ వినాయక్ రెడ్డి దాఖలు చేసిన పిల్ను చీఫ్ జస్టిస్ సతీశ్ చంద్ర శర్మ, జస్టిస్ అభినంద్ కుమార్ షావిలిల డివిజన్ బెంచ్ శుక్రవారం విచారించింది. మెంబర్స్గా లింగారెడ్డి, రమావత్ ధన్సింగ్, సుమిత్ర ఆనంద్, రవీందర్ రెడ్డి, ఎ.చంద్రశేఖర్రావు, ఆర్.సత్యనారాయణను చట్ట వ్యతిరేకంగా నియమించారని, మరో 5 నెలల్లో వీరి పదవీకాలం పూర్తికాబోతున్నందున పిల్ను వెంటనే విచారించాలని పిటిషనర్ తరఫు సీనియర్ లాయర్ సరసాని సత్యం రెడ్డి కోరారు. సర్వీస్ కమిషన్ కౌంటర్ వేసిందని, అయితే రాష్ట్ర సర్కారు మాత్రం ఇప్పటికీ వేయలేదని కోర్టుకు తెలిపారు. కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర సర్కారును ఆదేశించిన బెంచ్.. విచారణను మార్చి 31కి వాయిదా వేసింది.
