- చిన్నారి చనిపోయిన ఘటన సుమోటోగా స్వీకరణ
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్లోని గుంతల రోడ్లపై స్టేటస్ రిపోర్డు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. మూడు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలంది. నిజాంపేట మున్సిపాలిటీని కూడా ప్రతివాదుల లిస్ట్లో చేర్చాలంది. చీఫ్ సెక్రటరీ, ఆర్అండ్బీ ముఖ్య కార్యదర్శి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ ముఖ్య కార్యదర్శితో పాటు నిజాంపేట మున్సిపాలిటీకి నోటీసులు ఇచ్చింది. హైదరాబాద్లోని బాచుపల్లిలో గుంతల రోడ్డు కారణంగా ఓ చిన్నారి చనిపోయింది. తన బిడ్డ దీక్షితను కిశోర్ బైక్పై స్కూల్కు తీసుకెళ్తుండగా, గుంతల రోడ్డు కారణంగా స్కూటీ స్కిడ్ అయింది. దీంతో ఇద్దరూ కిందపడిపోయారు. ఆ టైమ్ లో వెనుక నుంచి వచ్చిన బస్సు.. వారి పైనుంచి దూసుకెళ్లింది. పాప అక్కడికక్కడే చనిపోగా, తండ్రి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటనపై హైకోర్టు చీఫ్ జస్టిస్ కు లేఖ అందింది. దీన్ని సుమోటోగా స్వీకరించి.. చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ టి.వినోద్కుమార్ల డివిజన్ బెంచ్ మంగళవారం విచారణ చేపట్టింది. ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చిన అనంతరం.. విచారణను 3 వారాలకు వాయిదా వేసింది.