- సర్కారుకు హైకోర్టు ఆదేశాలు
హైదరాబాద్, వెలుగు: రెసిడెన్షియల్, రిలీజియస్ ఏరియాలు, స్కూళ్లకు దగ్గర్లో లిక్కర్ షాపుల పర్మిట్ రూమ్స్, బార్స్ లేకుండా చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలిచ్చింది. రెండు నెలల్లోగా లిక్కర్ దుకాణాలపై రాష్ట్ర సర్కార్ ఆడిట్ చేసి చట్ట వ్యతిరేకంగా ఉన్న వాటిని తొలగింపునకు చర్యలు తీసుకోవాలని పేర్కొంది. ఈ మేరకు చీఫ్ జస్టిస్ సతీశ్ చంద్రశర్మ, జస్టిస్ టి.తుకారాంజీలతో కూడిన డివిజన్ బెంచ్ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ ఎక్సైజ్ రూల్స్ ప్రకారం మద్యం షాపులు, బార్లు వంటివి నివాస ప్రాంతాలు, మతపరమైన ప్రార్థనా స్థలాలు, మందిరాలు, విద్యా సంస్థలు, ఆసుపత్రులకు దూరంగా ఉంచాలని చెప్పింది.
లిక్కర్ షాపులు, బార్లకు లైసెన్స్ ఇవ్వడమనేది ప్రభుత్వ విధాన నిర్ణయం కాబట్టి ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవడం లేదని చెప్పింది. అయితే రూల్స్ ప్రకారమే వాటికి అనుమతి ఉండాలని గుర్తు చేసింది. రూల్స్కు వ్యతిరేకంగా లిక్కర్ షాపులు, బార్లకు లైసెన్స్లు ఇవ్వడం వల్ల ఆ ప్రాంతాల్లోని మహిళలు ఇబ్బందులు పడుతున్నారని లాయర్ ఎస్. మహేందర్రాజు వేసిన పిల్పై హైకోర్టు విచారణను ముగించింది. నివాస ప్రాంతాలు ఇతర నిషిద్ధ ప్రదేశాల్లో మద్యం షాపులు ఏర్పాటు చేసినట్లుగా ఆధారాలతో పిటిషనర్ వస్తే తిరిగి హైకోర్టును ఆశ్రయించవచ్చని చెప్పింది. ఈ పిల్లో ఒక్క ఆధారం కూడా చూపలేదని చెప్పింది. 2013లో హైకోర్టు ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారమే రూల్స్ ఉన్నాయని, వాటికి లోబడే లిక్కర్ షాపులు, బార్లు ఉన్నాయని, తనిఖీలు కూడా చేస్తున్నామని ప్రభుత్వం ఈ సందర్భంగా చెప్పింది.