హైదరాబాద్, వెలుగు: గ్రూప్ –1 పోస్టుల్లో ఎస్టీ రిజర్వేషన్లు పది శాతం అమలు చేయాలనే రిట్పై హైకోర్టు షరతులతో కూడిన మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సెప్టెంబర్ 30న జారీ చేసిన జీవో 33 ప్రకారం ఎస్టీ రిజర్వేషన్లు 6 నుంచి పది శాతానికి పెరిగాయని, అయితే, గ్రూప్ 1 పోస్టుల నోటిఫికేషన్లో రోస్టర్ పాయింట్లను ప్రకటించకపోవడం వల్ల పెంచిన రిజర్వేషన్లు అమలు కావడం లేదని లంచ్మోషన్ రిట్ దాఖలైంది.
దీనిపై విచారణ జరిపిన కోర్టు.. తాము వెలువరించే తీర్పుకు లోబడి గ్రూప్ వన్ పరీక్షల ఫలితాలు ఉంటాయని, పరీక్షలను టీఎస్పీఎస్సీ యథాతథంగా నిర్వహించుకోవచ్చునని చెప్పింది. జీఏడీ చీఫ్ సెక్రటరీ, టైబల్ వెల్ఫేర్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్స్ ప్రిన్సిపల్ సెక్రటరీలు, పబ్లిక్ సర్వీస్ కమిషన్ సెక్రటరీలు కౌంటర్ దాఖలు చేయాలని జస్టిస్ ఎన్వీ శ్రవణ్కుమార్ గురువారం ఆదేశించారు. రోస్టర్ పాయింట్లు ప్రకటించాలంటూ మెదక్ జిల్లా సర్ధనా హవేలీ ఘన్పూర్ పోచమ్మరాల్ తండాకు చెందిన జి. స్వప్న సహా ఐదుగురు వేసిన రిట్ తరఫున న్యాయవాది బి.రచనారెడ్డి వాదించారు.