
హైదరాబాద్ సిటీ, వెలుగు: హైదరాబాద్ లో చెరువుల పరిరక్షణ కోసం ఏర్పాటు చేసిన హైడ్రా పనితీరును హైకోర్టు సోమవారం అభినందించింది. ఆక్రమణలకు గురైన బతుకమ్మకుంటను అభివృద్ధి చేయడం హర్షణీయమని న్యాయమూర్తి జస్టిస్ విజయ్సేన్రెడ్డి వ్యాఖ్యానించారు. సిటీలో ఇలాగే మరో 5 చెరువుల అభివృద్ధి పనులు జరుగుతున్నట్లు కోర్టు దృష్టికి వచ్చింది.
చెరువుల పునరుద్ధరణ విషయంలో తలెత్తుతున్న సమస్యలపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. చెరువుల ఎఫ్టీఎల్, బఫర్ జోన్ల పరిధిలో ఇండ్లు లేదా భూములు కోల్పోయిన వారికి ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్ (టీడీఆర్) కింద సరైన నష్టపరిహారం ఇవ్వాలని కోర్టు అభిప్రాయపడింది. ఇందుకోసం ప్రభుత్వం సరైన విధానాన్ని రూపొందించాల్సిన అవసరం ఉందని సూచించింది.