
హైదరాబాద్, వెలుగు: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం బహదూర్గూడలోని వివిధ సర్వే నంబర్లల్లోని దాదాపు 45.37 ఎకరాల భూమి తమదేనని వాదిస్తున్న ప్రభుత్వం చట్ట ప్రకారం ముందుకు వెళ్లవచ్చునని హైకోర్టు స్పష్టం చేసింది. ఆ భూమికి చెందిన 17 సేల్ డీడ్స్ను ప్రభుత్వం రద్దు చేయడాన్ని హైకోర్టు కొట్టివేసింది. ఆ గ్రామంలోని సర్వే నం.52, 53, 54, 50ల్లోని 45 ఎకరాలకు చెందిన 17 సేల్ డీడ్స్ను రద్దు చేస్తూ సబ్ రిజిస్ట్రార్ ఇచ్చిన ఆదేశాల్ని రద్దు చేసింది.
సబ్ రిజిస్ట్రార్ సేల్డీడ్స్ రద్దు చేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన మూడు పిటిషన్లపై జస్టిస్ కె.శరత్ ఇటీవల తీర్పు చెప్పారు. కలెక్టర్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ కమిషనర్కు రాసిన లేఖలో బహదూర్గూడలోని సర్వే నం.28లో 150 ఎకరాలు, సర్వే నెం. 43, 44ల్లో రెండు ఎకరాల భూదాన్ భూమి, సర్వే నెం.62లో 500 ఎకరాల పోరంబోకు భూములు నిషేధిత జాబితాలో ఉన్నాయి. సర్వే నం. 28, 62లో ప్రభుత్వానికి 1212.25 ఎకరాలు ఉంది. ఇందులోని భూమినే పిటిషనర్లు తమవని చెబుతున్నారనే ప్రభుత్వ వాదనలకు ఆధారాలు చూపలేదు అని న్యాయమూర్తి తీర్పులో పేర్కొన్నారు.