హైదరాబాద్, వెలుగు: ‘‘ప్రభుత్వ లెక్కల ప్రకారం రాష్ట్రంలో 37 లక్షల మందికి కరోనా టెస్టులు చేయాలి. అయితే టెస్టింగ్ కిట్లు మాత్రం 67 వేలు ఉన్నాయి. అంటే సుమారు 36.33 లక్షల కిట్లను ఎట్ల సమకూరుస్తారు?’’ అని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. రాష్ట్రంలో ప్రధానంగా హైదరాబాద్లో రెడ్ జోన్స్ ఎక్కువగా ఉన్నాయని, అక్కడున్న వాళ్లకు కరోనా టెస్టులు ఎలా చేస్తారని, అనుమానితులను ఎట్లా గుర్తిస్తారో చెప్పాలని చీఫ్ జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ అమర్నాథ్గౌడ్తో కూడిన డివిజన్ బెంచ్ ఆదేశించింది. కరోనా టెస్టులు ఆరోగ్యశ్రీ పథకం కింద చేస్తున్నారో లేదో తెలపాలని కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. ప్రైవేటు హాస్పిటల్స్లో కూడా ఉచితంగా కరోనా టెస్ట్లు చేయాలని కోరుతూ లాయర్ తిరుమలరావు రాసిన లేఖను హైకోర్టు పిల్గా తీసుకొని శనివారం విచారించింది. కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ స్కీం కింద కరోనా టెస్టుల కోసం గైడ్లైన్స్ ఇవ్వగా.. వాటిని రాష్ట్రంలో అమలు చేయడం లేదని, సొంత గైడ్లైన్స్ ప్రకారం వెళ్తున్నారని పిటిషనర్ తరఫు లాయర్ వాదించారు. ప్రైవేటు హాస్పిటల్స్లో కరోనా టెస్టులు చేయకపోతే ఆ రోగి మరో ఆస్పత్రికి వెళ్లేప్పుడు ఇతరులకు వైరస్ వ్యాప్తి చెందే ప్రమాదం ఉందన్నారు. దీనిపై కూడా వివరణ ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. విచారణను ఈ నెల 22కు వాయిదా వేసింది.
నాయీ బ్రాహ్మణులకు సాయం చేశారా ?
లాక్డౌన్ నేపథ్యంలో బార్బర్ షాపులు మూతపడినందున ఉపాధి కోల్పోయిన నాయీ బ్రాహ్మణులకు అందజేసిన సహాయక చర్యల గురించి తెలియజేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు వివరణ కోరింది. పేదలకు, వలస కార్మికులకు, ఆహార భద్రతా కార్డు లేనోళ్లకు కూడా ప్రభుత్వం నిత్యావసర వస్తువులతోపాటు రూ.1500 ఇచ్చిందని, నాయీ బ్రాహ్మణులకు కూడా ఇవ్వాలంటూ తెలంగాణ రాష్ట్ర నాయీ బ్రాహ్మణ సంఘం (యూత్) అధ్యక్షుడు ధనరాజ్ రాసిన లేఖను హైకోర్టు పిల్గా తీసుకొని పై విధంగా ఆదేశించింది.
