- చెన్నమనేనిని ప్రశ్నించిన హైకోర్టు
హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ ద్వంద్వ పౌరసత్వంపై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. గత ఏడాది కాలంలో ఏయే విదేశీ పర్యటనలు చేశారో వివరించాలని రమేష్ను ఆదేశించింది. ఆయన చేపట్టిన పర్యటన వివరాలు సమర్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. అంతే కాకుండా 2018లో వేములవాడ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు జర్మనీ పౌరసత్వం ఉందా అని ప్రశ్నించింది.
జర్మనీ పౌరసత్వం ఉండగానే అప్పుడు ఎన్నికల్లో పోటీ చేశారా అని అడిగింది. తన భారతదేశ పౌరసత్వాన్ని రద్దు చేయడాన్ని సవాల్ చేస్తూ చెన్నమనేని దాఖలు చేసిన పిటిషన్ను బుధవారం హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి.విజయ్సేన్ రెడ్డి విచారణ జరిపారు. ఆయన ద్వంద్వ పౌరసత్వంపై గతంలో ఫిర్యాదు చేసిన ప్రస్తుత వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తరఫున లాయర్ రవికిరణ్ వాదనలు వినిపించారు.
2018 ఎన్నికల సందర్బంగా రమేష్ జర్మనీ పాస్ పోర్ట్ మీద ప్రయాణం చేశారని చెప్పారు. 2019 లో ఓసీఐ కార్డుకు అప్లై చేశారని, దీనీని 2019 సెప్టెంబర్ లో తీసుకునే వరకు కూడా జర్మనీ పౌరసత్వంతోనే ఉన్నారని వివరించారు. వాదనలు విన్న హైకోర్టు తదుపరి విచారణను వచ్చే శుక్రవారానికి వాయిదా వేసింది.