జేడీఎస్ అధినేత కుమారస్వామి కుమారుడు, హీరో నిఖిల్ పెళ్లి వ్యవహారంపై కర్ణాటక హైకోర్టు ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. లాక్ డౌన్ వేళ పెళ్లికి అనుమతి ఎలా ఇచ్చారని యడియూరప్ప ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. లాక్డౌన్ నిబంధనలు , సామాజిక దూరం పాటించకుండా జరిగిన ఆ పెళ్లి తంతుపై జవాబివ్వాలని కోరింది.
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుందనే ఉద్దేశంతో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ఎలాంటి శుభకార్యాలు జరుపకూడదని ఆదేశించినప్పటికీ… ఈ నెల 17న బెంగళూరు రామ్నగర్ ఫామ్హౌస్లో కుమారస్వామి తన కొడుకు నిఖిల్ పెళ్లి జరిపించారు. ఈ పెళ్లికి 60-70 మంది వి.విఐపిలు హాజరైనట్టు పోలీసు అధికారులు తెలిపారు. పెళ్లికి హాజరైన అతిధులెవ్వరూ క్వారంటైన్ నిబంధనలను పాటించలేదు. ఎవ్వరూ భౌతిక దూరం పాటించలేదు, మాస్కులు ధరించలేదు. ఈ పెళ్ళికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో పలువురు నెటిజన్లు మాజీ సీఎం నిర్లక్ష్య ధోరణి పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు.
