పరువు హత్యల లెక్కలపై సర్కార్ ను నిలదీసిన హైకోర్టు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో నాలుగేండ్లలో పరువు హత్యలకు సంబంధించి నాలుగు కేసులే నమోదయ్యాయా.. పరువు దాడుల కేసులు మూడే వచ్చాయా.. అంటూ ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. ప్రభుత్వం ఇచ్చే లెక్కలకు, వాస్తవాలకు పొంతన లేదని అసంతృప్తి వ్యక్తం చేసింది. పరువు హత్యలను అడ్డుకునేందుకు సుప్రీంకోర్టు శక్తివాహిని కేసులో ఇచ్చిన గైడ్లైన్స్ అమలు చేయాలని 2018 మే 2న ప్రభుత్వం పోలీస్ స్టేషన్లకు ఇచ్చిన ఉత్తర్వుల అమలు తీరును ఎందుకు వివరించలేదని ప్రశ్నించింది. పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను సెప్టెంబర్ 29కి వాయిదా వేస్తున్నట్లు చీఫ్ జస్టిస్ హిమాకోహ్లీ, న్యాయమూర్తి జస్టిస్ బి.విజయ్సేన్రెడ్డిలతో కూడిన డివిజన్ బెంచ్ వెల్లడించింది. పరువు హత్యల నివారణకు సుప్రీంకోర్టు గైడ్లైన్స్ అమలు చేసేలా ప్రభుత్వానికి ఉత్తర్వులివ్వాలని మలక్పేట్కు చెందిన సోషల్ వర్కర్ యు.సాంబశివరావు పిల్ దాఖలు చేశారు. 2017 నుంచి 2021 మధ్యకాలంలో నాలుగు పరువు హత్యలు, పరువు పోయిందని మూడు దాడుల కేసులు నమోదు అయ్యాయని విచారణలో అడిషనల్ డీజీపీ (లీగల్) రాజీవ్ రతన్ కౌంటర్ దాఖలు చేశారు. ఇవి కింది కోర్టుల్లో విచారణలో ఉన్నాయని పేర్కొన్నారు. గవర్నమెంట్ స్పెషల్ జీపీ ఎ.సంజీవ్కుమార్ వాదిస్తూ.. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ అమలు చేయాలని అన్ని పీఎస్లకు సర్క్యులర్ జారీ అయ్యిందన్నారు. సర్క్యులర్ ఇచ్చి ఊరుకుంటే సరిపోదని, దాని అమలు గురించి చెప్పాలని హైకోర్టు ఆదేశించింది. తమకున్న సమాచారం ప్రకారం 50 ఖాప్ పంచాయతీలు జరిగాయని, అయితే ఆ కేసుల స్థితిగతులపై వివరాలు ఎందుకివ్వలేదని ప్రశ్నించింది. ఐటీ వంటి రంగాల్లో ముందున్న రాష్ట్రంలో ఆ స్థాయిలో ఖాప్ పంచాయతీలు జరగడమంటే చిన్న విషయం కాదని ఆందోళన వ్యక్తం చేసింది. దీనిని ప్రభుత్వం తీవ్రంగా పరిగణించకపోతే తామే కఠిన ఆదేశాలివ్వాల్సి వస్తుందని హెచ్చరించింది. సమగ్ర వివరాలతో మరో కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను సెప్టెంబర్29కి వాయిదా వేసింది.