- రాయదుర్గం భూములకు సబ్సిడీ ఎందుకు ?
- రాష్ట్ర సర్కార్కు హైకోర్టు నోటీసులు
- రెండేండ్లుగా కౌంటర్ దాఖలు చేయకపోవటంపై సీరియస్
- మై హోమ్ రామేశ్వరావుకు లాభం చేకూర్చారంటూ రేవంత్రెడ్డి పిల్
హైదరాబాద్, వెలుగు: రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం రాయదుర్గంలో అత్యంత విలువైన 31.35 ఎకరాల భూమిని వేలంలో డీఎల్ఎఫ్ దక్కించుకుంటే.. మై హోమ్ గ్రూప్ అక్రమంగా కాజేసిందని ఆరోపిస్తూ పీసీసీ చీఫ్, మల్కాజిగిరి ఎంపీ ఎ.రేవంత్రెడ్డి వేసిన పిల్లో రాష్ట్ర సర్కార్ కౌంటర్ దాఖలు చేయకపోడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. 2020లో దాఖలైన పిల్లో ఇప్పటి వరకు ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయలేదని ఆక్షేపించింది. ఆరు వారాలు గడువు ఇస్తున్నామని, ఈలోగా ప్రభుత్వం తమ వాదనలతో కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలని ఆదేశించింది. పిల్ను చీఫ్ జస్టిస్ సతీష్చంద్ర శర్మ, జస్టిస్ అభినంద్కుమార్ షావిలిలతో కూడిన డివిజన్ బెంచ్ గురువారం విచారణ చేపట్టింది. రాయ్దుర్గ్లోని టీఎస్ఐఐసీకి చెందిన కోట్ల రూపాయాల విలువైన భూమిని ప్రైవేట్ సంస్థకు కేటాయించారని పిటిషనర్ తరఫు లాయర్ ఎస్ఎస్ ప్రసాద్ వాదించారు. కౌంటర్ దాఖలు చేసేందుకు గడువు కావాలని మరోసారి ప్రభుత్వం కోరింది. ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయడంలో కావాలని లేట్ చేస్తున్నదని ప్రసాద్ కోర్టుకు తెలిపారు. గతంలో చాలాసార్లు గడువు ఇచ్చామని హైకోర్టు గుర్తు చేసింది. విచారణ ఆరు వారాలు వాయిదా వేస్తున్నామని, ఈలోగా కౌంటర్ వేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. వేలంలో పాల్గొన్న కంపెనీకి కాకుండా మరో కంపెనీకి భూములు ఏ రూల్ ప్రకారం ఇచ్చారో, స్టాంప్డ్యూటీ రాయితీలు ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందో వివరించాలని ఆదేశించింది.
రామేశ్వర్రావుకు రూ.2,926 కోట్ల లాభం!
‘ఉమ్మడి ఏపీ ప్రభుత్వం రాయ్దుర్గం సర్వే 83లోని 424.13 ఎకరాల భూములను ఇంటిగ్రేటెడ్ ఐటీ పార్కు ఏర్పాటు కోసం కేటాయించింది. అందులోని 31.35 ఎకరాల్లో ఐటీ అభివృద్ధి కోసం టీఎస్ఐఐసీ బిడ్లను ఆహ్వానించింది. డీఎల్ఎఫ్ రూ.580.5 కోట్లకు ఆ భూముల్ని వేలంలో దక్కించుకుంది. వేలం షరతుల ప్రకారం ఐదేండ్లలో భూమిని వినియోగంలోకి తేవాలి. లేకుంటే వేలం రద్దు చేసి మరో సంస్థకు భూములు కేటాయించే అధికారం టీఎస్ఐఐసీకి ఉంటుంది. అయితే, రూల్స్కు వ్యతిరేకంగా డీఎల్ఎఫ్ రాయ్దుర్గ్ డెవలపర్స్ సంస్థకు బదలాయించింది. తర్వాత సంస్థ పేరును ఆక్వా స్పేస్ డెవలర్స్గా మార్చుకోడానికి అనుమతులు ఇచ్చారు. ఇది కేసీఆర్కు సన్నిహితుడైన మైహోమ్స్ కన్స్ట్రక్షన్స్ కంపెనీకి చెందిన షెల్ కంపెనీ. ఆక్వా స్పేస్ డెవలపర్స్ సంస్థ బ్యాంకు లోన్లకు మైహోమ్ కన్స్ట్రక్షన్ హామీగా ఉంది. ప్రభుత్వం రూ.3 కోట్ల ఖర్చుతో వేసిన రోడ్డును తొలగించి మరీ ఆ భూముల్ని అప్పగించింది. రూ.38 కోట్ల స్టాంప్ డ్యూటీని కూడా మినహాయింపు ఇచ్చి ప్రభుత్వ ఖజానాకు భారీగా గండి కొట్టింది. మొత్తంగా మైహోమ్ షెల్ కంపెనీకి రూ.2,926 కోట్ల లబ్ధి చేకూరేలా ప్రభుత్వ చర్యలు ఉన్నాయి’ అని పిల్లో రేవంత్రెడ్డి వివరించారు.
ఇవి కూడా చదవండి