హైకోర్టు తీర్పు తర్వాతే సింగరేణి ..ఎన్నికలపై క్లారిటీ

హైకోర్టు తీర్పు తర్వాతే సింగరేణి ..ఎన్నికలపై క్లారిటీ

కోల్​బెల్ట్, వెలుగు: సింగరేణి కార్మిక గుర్తింపు సంఘం ఎన్నికల నిర్వహణపై ప్రతిష్టంభన కొనసాగుతోంది. శుక్రవారం సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల షెడ్యూల్ రిలీజ్​ కోసం డిప్యూటీ చీఫ్​లేబర్​కమిషనర్​(సెంట్రల్​) సమక్షంలో సింగరేణి యాజమాన్యం, కార్మిక సంఘాలతో చర్చలు నిర్వహించగా ఎటూ తేలలేదు. దీంతో మళ్లీ ఈనెల 27న నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు ఎన్నికల విషయంలో హైకోర్టులో వేసిన రిట్​పిటిషన్లపై తీర్పు రిజర్వులో ఉంది. శుక్రవారం ఉదయం హైదరాబాద్​లోని డీసీఎల్​సీ ఆఫీస్​లో సెంట్రల్​డిప్యూటీ చీఫ్​లేబర్​కమిషనర్​డి.

శ్రీనివాసులు సమక్షంలో సింగరేణి యాజమాన్యం, 14 కార్మిక సంఘాలు చర్చలు జరిపాయి. ఇందులో  ఈనెల 11న విడుదల చేయాల్సిన గుర్తింపు సంఘం ఎన్నికల నోటిఫికేషన్​ యాజమాన్యం అభ్యర్థన మేరకు 22కు వాయిదా వేసిన విషయం, అక్టోబర్​28న నిర్వహించాలనుకున్న ఎన్నికలు, ఓటర్ల లిస్టు, గుర్తుల కేటాయింపు తదితర అంశాలపై డిస్కస్​చేశారు. శుక్రవారమే షెడ్యూల్​రిలీజ్​చేయాలని కార్మిక సంఘాలు పట్టుబట్టాయి. దీంతో షెడ్యూల్​రిలీజ్​ కోసం టీబీజీకేఎస్​, సింగరేణి యాజమాన్యం మినహా అన్ని కార్మిక సంఘాలు సంతకాలు పెట్టాయి. 

కోర్టు తీర్పు తర్వాతే అన్న యాజమాన్యం

సాయంత్రం జరిగిన చర్చల్లో సింగరేణి డైరెక్టర్​(ఫైనాన్స్​పా) బలరామ్​నాయక్​పాల్గొన్నారు. హైకోర్టులో ఎన్నికల విషయంలో వేసిన రిట్​పిటిషన్లపై తీర్పు వచ్చిన తర్వాతే షెడ్యూల్​రిలీజ్ అంశంపై చర్చిద్దామంటూ సింగరేణి యాజమాన్యం ప్రతిపాదన తీసుకువచ్చింది. చర్చలను వాయిదా వేయాలని, తిరిగి ఈనెల 27న నిర్వహిస్తామని పేర్కొంది. 

కానీ,  ఏఐటీయూసీ, బీఎంఎస్​సంఘాలు మాత్రం షెడ్యూల్ ​రిలీజ్​ చేయాల్సిందేనని పట్టుబట్టాయి. ఒకదశలో సంఘాల ప్రతినిధులు వాదోపవాదాలకు దిగారు. మోజార్టీ సంఘాలు యాజమాన్యం కోరిన విధంగా 27వ తేదీన చర్చలకు ఒప్పుకున్నాయి. ఈ సందర్భంగా కొన్ని సంఘాల డిమాండ్​ మేరకు ఎన్నికలు నిర్వహించేంత వరకు అన్ని కార్మిక సంఘాలకు సమాన ప్రాతినిధ్యం కల్పిస్తామంటూ సింగరేణి సర్క్యులర్ రిలీజ్​ చేసింది.  

ఏమవుతుందో..ఏమో...

సింగరేణి కార్మిక సంఘం గుర్తింపు ఎన్నికల భవితవ్యం హైకోర్టు తీర్పుపైనే ఆధారపడి ఉంది. జమిలీ ఎన్నికలపై పార్లమెంటు సమావేశాల్లో ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం, తెలంగాణ అసెంబ్లీకి అక్టోబర్​లో ఎన్నికల నోటిఫికేషన్​ వెలువడే అవకాశం ఉండడంతో సింగరేణి కార్మిక సంఘం ఎన్నికలపై సందిగ్ధత ఏర్పడింది. ఈ కారణాలతో ఎన్నికలు వాయిదా వేయాలని కోరుతూ సింగరేణి యాజమాన్యం హైకోర్టును ఆశ్రయించగా, గుర్తింపు సంఘం కాల పరిమితిని ముందుగానే నిర్ణయించాలంటూ గుర్తింపు సంఘమైన టీబీజీకేఎస్, ఎన్నికలు వెంటనే జరపాలంటూ ఏఐటీయూసీ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. 

గతనెల 11న డిసీఎల్​సీ సమక్షంలో కార్మిక సంఘాలు, సింగరేణి యాజమాన్యం మధ్య జరిగిన చర్చల్లో అక్టోబర్​28న ఎన్నికలు నిర్వహణకు ప్రాథమికంగా  గ్రీన్​సిగ్నల్ ​రాగా ఇతర అంశాలపై  22వ తేదీన(శుక్రవారం) మరోసారి చర్చలు జరిపి ఫైనల్​ నిర్ణయం తీసుకుందామని అనుకున్నారు. అందులో భాగంగానే శుక్రవారం చర్చలు నిర్వహించారు. దీనికి ముందే సింగరేణి యాజమాన్యం ఎన్నికలు ఇప్పుడే నిర్వహించలేమంటూ హైకోర్టులో పిటిషన్ ​దాఖలు చేసింది. వరుస పండుగలు, అసెంబ్లీ ఎన్నికల కోసం ఈసీ ఆఫీసర్లతో సమావేశాల నేపథ్యంలో సాధ్యం కాదని హైకోర్టులో వాదనలు వినిపించింది. అక్టోబర్​లో వీలుకాదని  గడువు కావాలని కోరింది. ఆరు జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు కూడా ఎన్నికలను వాయిదా వేయాలని ప్రభుత్వానికి లెటర్లు రాశారని స్పష్టం చేసింది. దీంతో ఈ పిటిషన్​పై శుక్రవారం విచారణ పూర్తి కాగా, కోర్టు తీర్పును రిజర్వులో ఉంచింది. శనివారమో లేక సోమవారమో హైకోర్టు తీర్పును వెల్లడించే అవకాశం ఉంది.  

ఓడిపోతే అసెంబ్లీ ఎన్నికలపై ప్రభావం పడుతుందనే.. 

కొన్ని కార్మిక సంఘాలకు అసలు ఎన్నికలు ఇష్టం లేదని, ఎన్నికలు జరిగితే ఓటమి తప్పదనే ఉద్దేశంతో ఎన్నికల వాయిదాకు కుట్రలు చేస్తున్నాయని ఏఐటీయూసీ ప్రెసిడెంట్​వాసిరెడ్డి సీతారామయ్య, బీఎంఎస్ స్టేట్​ ప్రెసిడెంట్​యాదగిరి సత్తయ్య, వర్కింగ్​ప్రెసిడెంట్​పేరం రమేశ్​ ఆరోపించారు. కార్మిక సంఘం ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు వస్తే అసెంబ్లీ ఎన్నికల్లో ఇబ్బందులు తప్పవని భావించి రాష్ట్ర సర్కార్​ ఎన్నికలకు చొరవచూపడం లేదని వారు పేర్కొన్నారు. 

చర్చలు జరుగుతుండగానే సింగరేణి యాజమాన్యం అన్ని సంఘాలకు సమాన ప్రాతినిధ్యం వర్తింపజేస్తామంటూ సర్క్యులర్​జారీ చేయడం ఎన్నికల వాయిదాలో భాగమేనని ఆరోపించారు.