- సీబీఐటీ, ఎంజీఐటీ కాలేజీల ఫీజులపై హైకోర్టు తీర్పు
- టీఏఎఫ్ఆర్సీ నిర్ణయించిన ఫీజులే తీసుకోవాలని ఆదేశం
- పేరెంట్స్, స్టూడెంట్స్ కు ఉపశమనం
హైదరాబాద్, వెలుగు:
ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీల అడ్డగోలు ఫీజుల వ్యవహారానికి హైకోర్టు బ్రేక్ వేసింది. తెలంగాణ అడ్మిషన్ అండ్ ఫీ రెగ్యులేటరీ కమిటీ (టీఏఎఫ్ఆర్సీ) నిర్దేశించిన విధంగానే కాలేజీ మేనేజ్మెంట్లు ఫీజులను వసూలు చేయాలని మంగళవారం హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అధిక ఫీజులను వసూలు చేసే ఇంజినీరింగ్ కాలేజీలన్నింటికీ ఈ తీర్పుతో అడ్డుకట్ట పడుతుందని విద్యావేత్తలు అంటున్నారు. 2007లో సుప్రీంకోర్టు సూచనల మేరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ‘ప్రైవేట్ అన్ఎయిడెడ్ ప్రొఫెషనల్’ కాలేజీల్లో ఫీజులను నియంత్రించేందుకు అడ్మిషన్స్ అండ్ ఫీ రెగ్యులేషన్ కమిటీ (ఏఎఫ్ఆర్సీ)ని ప్రభుత్వం ఏర్పాటు చేస్తారు. 2015 జులై 22న జీఓ నెం.160- ద్వారా తెలంగాణ ఏఎఫ్ఆర్సీ ఏర్పడింది. టీఏఎఫ్ఆర్సీ సూచించిన ఫీజులను మాత్రమే అన్ని ప్రైవేట్ ప్రొఫెషనల్ కాలేజీలు వసూలు చేసుకోవాల్సి ఉంటుంది. కానీ 2016–17 నుంచి 2018–19 బ్లాక్ పీరియడుకు సంబంధించిన జీఓ నెం. 21, జీఓ నెం.3 ప్రకారం టీఏఎఫ్ఆర్సీ సూచించిన ఫీజు తమకు సరిపోదని గ్రేటర్లోని పలు ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీల మేనేజ్మెంట్లు హైకోర్టులకు పోయి అధిక ఫీజులను వసూలు చేసుకునేందుకు అనుమతులు తెచ్చుకున్నాయి. ఈ వ్యవహారాన్ని ప్రభుత్వం సీరియస్గా తీసుకోకపోగా ఆయా మేనేజ్మెంట్ల అడ్డగోలు ఫీజులకు పరోక్షంగా మద్దతుగా నిలిచినట్లు అప్పట్లో ఆరోపణలు వచ్చాయి.
మినిస్టర్ చెప్పినా వినలేదు
సీబీఐటీ ఇంజినీరింగ్ కాలేజీ 2016 నుంచి 2019 సంవత్సరాలకు సంబంధించిన బ్లాక్ పీరియడ్కు రూ.1,13,500 ఫీజును టీఏఎఫ్ఆర్సీ నిర్దేశించింది. అలాగే ఎంజీఐటీ కాలేజీకి రూ.లక్ష ఫీజుగా నిర్ణయించింది. అడ్మిషన్ టైంలో అంత బాగానే ఉన్నా 2018 డిసెంబర్లో తమకు నిర్వహణ ఖర్చులు పెరిగాయని హైకోర్టుకు పోయి సీబీఐటీ రూ.2 లక్షలు, ఎంజీఐటీ రూ.1.60 లక్షల ఫీజును స్టూడెంట్స్ వద్ద నుంచి వసూలు చేసుకునేందుకు అనుమతి తెచ్చుకున్నాయి. పెంచిన ఫీజులను చెల్లించాలని ఇంజినీరింగ్ స్టూడెంట్స్ కు సర్క్యులర్ జారీ చేశారు. పైగా ఫీజులను చెల్లించేందుకు తుది గడువును సైతం పెట్టింది. గడువులోగా ఫీజు చెల్లించని పక్షంలో ఫైన్ వేసేందుకు సైతం సిద్ధమయ్యారు. దీంతో వారం రోజుల వరకు స్టూడెంట్స్ ఫీజుల పెంపు వ్యతిరేకిస్తూ మేనేజ్మెంట్ల తీరును నిరసిస్తూ స్టూడెంట్స్ ఆందోళన చేశారు. పెంచిన ఫీజులు చెల్లించలేమని స్టూడెంట్స్, వారి పేరెంట్స్ కాలేజీల వద్ద ధర్నాలు చేశారు. కాలేజీల మేనేజ్మెంట్లు పోలీసులను పెట్టి వారి ఆందోళనలను అణచి వేశాయి. పిల్లల చదువు దెబ్బతింటుందనే భయంతో చాలామంది పేరెంట్స్ అప్పులు చేసైనా అదనపు ఫీజులు చెల్లించాల్సి వచ్చింది. సీబీఐటీ ఆందోళనకు స్టూడెంట్స్ ను ఉసిగొల్పారని పేర్కొంటూ 26 మంది స్టూడెంట్స్ ని సస్పెండ్ చేసింది. పేరెంట్స్ తో కలిసి విచారణ కమిటీ ముందు హాజరై వివరణ ఇవ్వాలని నోటీసులు ఇచ్చిన ఘటన అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. సీబీఐటీ తదితర హైకోర్టు నుంచి అనుమతి తెచ్చుకున్న ఇంజినీరింగ్ కాలేజీలు పెంచిన ఫీజుపై స్వయంగా అప్పటి ఎడ్యుకేషన్ మినిస్టర్ వారించిన కాలేజీ మేనేజ్మెంట్లు పెడచెవిన పెట్టి ఫీజు కట్టాలని స్టూడెంట్స్ కు సర్క్యులర్లు జారీ చేశారు.
వేలాది మందికి లబ్ది
సీబీఐటీ, ఎంజీఐటీ ఇంజనీరింగ్ కళాశాలల్లో అధిక ఫీజులను అరికట్టాలని జాయింట్ యాక్షన్ కమిటీ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజెస్ పేరెంట్స్ తరపున హైకోర్టుకు పోయాం. వాసవి ఇంజినీరింగ్ కాలేజీ అధిక ఫీజులను వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టుకు పోయి విజయం సాధించాం. ఇటీవల టీఏఎఫ్ఆర్సీ చైర్మన్ జస్టిస్ స్వరూప్రెడ్డిని కలిసి విన్నవించాం. వందలాది మందికి మేలు చేసేలా తీర్పు రావడం సంతోషం. – ఎన్.నారాయణ, అధ్యక్షుడు, తెలంగాణ పేరెంట్స్ అసోసియేషన్