- కేంద్రం, ఆర్బీఐకి హైకోర్టు ఆదేశం
హైదరాబాద్, వెలుగు: ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని సిబిల్ స్కోరు నివేదికతోపాటు వెల్లడించడంపై దాఖలైన పిటిషన్లో కౌంటరు దాఖలు చేయకపోవడంపై కేంద్రం, ఆర్బీఐపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. మార్చి 17లోగా కౌంటరు దాఖలు చేయని పక్షంలో జరిమానా విధించాల్సి ఉంటుందని హెచ్చరించింది. క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీల నిబంధనలను సవరిస్తూ 2021 నవంబరులో ఆర్బీఐ జారీ చేసిన నోటిఫికేషన్ను సవాలు చేస్తూ కృపా సోని 2021లో పిల్ దాఖలు చేశారు. దీనిపై చీఫ్ జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్, జస్టిస్ జీఎం మొహియుద్దీన్తో కూడిన బెంచ్ విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. సిబిల్ స్కోరును వెల్లడించే క్రమంలో నివేదికతోపాటు వ్యక్తిగత వివరాలను వెల్లడిస్తున్నాయని తెలిపారు.
వ్యక్తిగత సమాచార రక్షణకు సంబంధించి పటిష్టమైన విధానం రూపొందించేలా చర్యలు తీసుకునేదాకా ఆర్బీఐ సర్క్యులర్ను నిలిపివేయాలని కోరారు. వాదనలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం ఇందులో ఇప్పటివరకు కౌంటర్లు దాఖలు చేయలేదని, ప్రతివాదులకు చివరిగా ఓ అవకాశం ఇస్తూ మార్చి 17లోగా కౌంటర్లు దాఖలు చేయకపోతే జరిమానా విధించాల్సి ఉంటుందని హెచ్చరిస్తూ విచారణను వాయిదా వేసింది.
