హైదరాబాద్, వెలుగు : పీజీ మెడికల్ కన్వీనర్ కోటా సీట్ల కేటాయింపును 10 దాకా ఖరారు చేయవద్దని కాళోజీ హెల్త్ వర్సిటీని హైకోర్టు ఆదేశించింది. రూరల్, ట్రైబల్ ఏరియాల్లో పనిచేసే డాక్టర్లకు వైద్య విధాన పరిషత్ ఇచ్చిన సర్టిఫికెట్లు చెల్లవని చెప్పడం అన్యాయమని పేర్కొంటూ లంచ్ మోషన్లో పిటిషన్ దాఖలైంది. నల్గొండ జిల్లా చౌటుప్పల్-కు చెందిన డాక్టర్ దిండు మల్లికార్జున్ సహా మరో ముగ్గురి సర్వీస్ సర్టిఫికెట్లను నీట్ పీజీ మెడికల్ కోటాలో పరిగణలోకి తీసుకోలేదని కోర్టులో రిట్ పిటిషన్లు దాఖలయ్యాయి. గురువారం వెబ్ ఆప్షన్లు పూర్తి అవుతాయని, తక్షణమే హైకోర్టు స్పందించాలని పిటిషనర్లు కోరారు.
వీటిపై జస్టిస్ కె.లక్ష్మణ్, జస్టిస్ సుమలత డివిజన్ బెంచ్ గురువారం విచారణ చేపట్టింది. గ్రామాలు, గిరిజన ప్రాంతాల్లో పనిచేస్తున్న వైద్యులకు పీజీ కౌన్సెలింగ్లో సర్వీస్ కోటా ఉంటుందని పిటిషనర్ అడ్వొకేట్ సామ సందీప్రెడ్డి కోర్టుకు విన్నవించారు. వాదనల తర్వాత వైద్య విధాన పరిషత్ తీరును హైకోర్టు తప్పుపట్టింది. రూరల్ ఏరి యాలో చేసే వారికి ఇన్సర్వీస్ కోటా రిజర్వేషన్ల అంశంపై సమగ్ర వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది.