హైదరాబాద్, వెలుగు: కరోనా ట్రీట్ మెంట్ కు ప్రభుత్వ, ప్రైవేట్ టీచింగ్ హాస్పిటళ్లను ఎందుకు వాడుకోవడం లేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. దీనిపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. టీచింగ్, మిలటరీ ఆస్పత్రులను కరోనా ట్రీట్ మెంట్ కు వినియోగించుకునేలా ఉత్తర్వులివ్వాలని కోరుతూ డాక్టర్ ఆర్.శ్రీవాత్సవ్ ఫైల్ చేసిన పిల్ను చీఫ్ జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ బి.విజయ్సేన్రెడ్డిలతో కూడిన డివిజన్ బెంచ్ శుక్రవారం విచారించింది. వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉందని, వాటిని ఎందుకు వాడుకోవడం లేదో చెప్పాలని, ఈ విషయంలో సర్కార్ విధానం ఏమిటో చెప్పాలని కోర్టు ఆదేశించింది. ప్రైవేట్ టీచింగ్ హాస్పిటల్స్ అపోలో, డెక్కన్, కామినేని, ఆయాన్, షాదాన్ , భాస్కర్ మెడికల్ సైన్సెస్లతో పాటు తెలంగాణ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల అసోసియేషన్ అధ్యక్షుడు, మిలటరీ, రైల్వే ఆస్పత్రులకు నోటీసులు జారీ చేసింది. విచారణను ఈ నెల 13కు వాయిదా వేసింది.
ఇథిలిన్ వాడకంపై క్లారిటీ ఇవ్వండి
కాయలను మాగబెట్టేందుకు ఇథిలిన్ వాడకంపైక్లారిటీ ఇవ్వాలని కేంద్ర, రాష్ట్రాలను హైకోర్టు ఆదేశించింది. కెమికల్స్ తో మాగబెడుతున్నారని మూడేళ్ల క్రితం వచ్చిన వార్తలను హైకోర్టు సుమోటోగా తీసుకుంది. ఇథిలిన్ అమ్ముతుంటే ప్రభుత్వం కేసులు పెడుతోందని ఫైల్ అయిన మరో 2 పిటిషన్లనూ చీఫ్ జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ బి.విజయ్సేన్రెడ్డిల డివిజన్ బెంచ్ శుక్రవారం విచారించింది. ఇథిలిన్ వాడితే ముప్పుంటుందని అమికస్ క్యూరీ, సీనియర్ లాయర్ నిరంజన్రెడ్డి కోర్టుకు విన్నవించారు. ఇథిలిన్ వాడొచ్చునని ఎఫ్ఎస్ఎస్ఏఐ రూల్స్ చెబుతున్నాయని పిటిషనర్ల తరఫు లాయర్ వాదించారు. విచారణ ఈ నెల 16కు వాయిదా పడింది.