హెడ్మాస్టర్ ను సస్పెండ్ చేస్తూ డీఈవో ఆదేశం
భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు : సెకండ్ క్లాస్ బాలికపై స్కూలు హెడ్మాస్టర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. కొద్దిరోజుల కింద జరిగిన ఈ దారుణంపై బాలిక కుటుంబ సభ్యులు పోలీసులకు మంగళవారం ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు చేపట్టారు. కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం చింతవర్రెలో జరిగిన ఈ ఘటన వివరాలు పోలీసులు మీడియాకు వెల్లడించారు. చింతవర్రె ప్రైమరీ స్కూల్లో హెచ్ఎం సునీల్ తో పాటు మరో టీచర్ పని చేస్తున్నారు. వీరిద్దరు చేరో వారం గ్రామానికి వచ్చి పాఠాలు చెప్తున్నారు. మొత్తం 12 మంది స్టూడెంట్లుంటే ఆరుగురు ఆడపిల్లలు ఈ స్కూలులో చదువుకుంటున్నారు. సెకండ్ క్లాస్ అమ్మాయి వారం కింద అనారోగ్యానికి గురికాగా డాక్టర్కు చూపించడంతో అత్యాచారానికి గురైనట్లు తేలింది. దీంతో గ్రామస్తులు హెచ్ఎం సునీల్ ను పట్టుకుని 4 రోజుల కింద దేహశుద్ది చేశారు. సునీల్ అక్కడి నుంచి పారిపోయాడు. గ్రామస్తులు మంగళవారం కంప్లైంట్ చేయడంతో తహశీల్దార్తో పాటు పోలీసులు ఎంక్వైరీ స్టార్ట్ చేశారు. బాలికను మెడికల్ టెస్టులకు పంపుతామని చెప్పారు. బాలికపట్ల అసభ్యంగా వ్యవహరించిన హెచ్ఎం సునీల్ను సస్పెండ్ చేస్తున్నట్టు డీఈఓ సోమశేఖర శర్మ పేర్కొన్నారు.