హైదరాబాద్, వెలుగు: రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం మోకిల ఫేజ్ 2లో హెచ్ఎండీఏ 60 ప్లాట్లను వేలం వేసింది. ఇందులో 58 ప్లాట్లు అమ్ముడుపోగా.. ప్రభుత్వానికి రూ. 122.42 కోట్ల ఆదాయం వచ్చింది. 361 ప్లాట్ నంబర్ లో 375 చదరపు గజాల ప్లాట్ గజం రూ.1 లక్ష పలికినట్లు హెచ్ఎండీఏ తెలిపింది. బుధవారం ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎంఎస్ టీసీ ఆన్ లైన్లో వేలం నిర్వహించింది. ఈ నెల 23 నుంచి 5 రోజుల పాటు ( 26, 27 తేదీలు మినహా ) 300 ప్లాట్లను రోజుకు 60 ప్లాట్ల చొప్పున వేలం వేయనున్నారు.
తొలిరోజు బుధవారం 20,025 చదరపు గజాల (60 ప్లాట్ల)కు వేలం చేపట్టారు. గజం కనీస ధరను రూ. 25 వేలుగా నిర్ణయించారు. ఉదయం సెషన్ లో 30 ప్లాట్లకు వేలం నిర్వహించగా.. హయ్యెస్ట్ గా గజం రూ. 72 వేలు, లోయెస్ట్గా రూ. 54 వేలు పలకగా, యావరేజ్ గా రూ.61,815 పలికింది. మధ్యాహ్నం సెషన్లో 30 ప్లాట్లకు వేలం నిర్వహించగా గజం హయ్యెస్ట్ రూ. 1 లక్ష పలకగా, లోయెస్ట్ రూ. 55 వేలు, యావరేజ్ గా రూ.65,125 వేలు పలికింది. రెండు సెషన్లలో కలిపి 58 ప్లాట్లు అమ్ముడుపోయి రూ. 122.42 కోట్ల ఆదాయం వచ్చింది.
కొన్నోళ్ల వివరాలు బయటకు చెప్తలే!
మోకిల ఫేజ్2లో బుధవారం నిర్వహించిన వేలంలో 58 ప్లాట్లను కొనుగోలు చేసిన వ్యక్తులు, కంపెనీల వివరాలను మాత్రం హెచ్ఎండీఏ సీక్రెట్గా ఉంచింది. కంపెనీలు, వ్యక్తుల పేర్లు వెల్లడించొద్దని ప్రభుత్వ పెద్దలు ఆదేశించటంతో ఈ వివరాలు సీక్రెట్గా ఉంచినట్లు హెచ్ఎండీఏ అధికారులు చెప్తున్నారు. . ఇటీవల బుద్వేల్లో100 ఎకరాలను వేలం నిర్వహించిన టైమ్లో కూడా వివరాలు బయటపెట్టలేదు.