హైదరాబాద్, వెలుగు : బండ్లగూడ, పోచారంలో 362 మందికి అధికారులు ఫ్లాట్లు కేటాయించారు. శుక్రవారం రాత్రి వరకు ఈ లాటరీ కొనసాగింది. బండ్లగూడలో 177, పోచారంలో 185 ఫ్లాట్లు కేటాయించామని హెచ్ఎండీఏ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ఫ్లాట్ దక్కిన వారికి త్వరలో అలాట్మెంట్ లెటర్ పంపిస్తామని, ఫ్లాట్ విలువలో 80 శాతం అమౌంట్ ను రెండు నెలల్లో, మిగతా 20 శాతాన్ని మరో నెలలో కట్టాలని అధికారులు చెప్పారు. తాము ఇచ్చిన గడువులోగా అమౌంట్ కట్టకపోతే టోకెన్ అడ్వాన్స్ ను హెచ్ఎండీఏ ఇవ్వదని వెల్లడించారు. ఆ ఫ్లాట్లను మళ్లీ వేలంలో ఉంచుతామని చెప్పారు.
అయితే, పబ్లిక్ 3బీహెచ్ కే డీలక్స్, 3 బీహెచ్ కేలపై ఎక్కువ ఆసక్తి చూపుతున్నారన్నారు. రూ.50 లక్షల లోపే ఈ రెండు ప్రాంతాల్లో 3 బీహెచ్ కే ఫ్లాట్ లభిస్తుందని, మార్కెట్ ధరతో పోలిస్తే ఈ అమౌంట్ చాలా తక్కువన్నారు. డబుల్, సింగిల్ బెడ్ రూమ్ ఫ్లాట్ల కొనుగోలుకు పబ్లిక్ ముందుకు రావడం లేదంటున్నారు. పోచారంలో త్రిబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్లు 16 ఉంటే 80 అప్లికేషన్లు వచ్చాయన్నారు. బండ్లగూడ, పోచారంలో మరో వెయి ఫ్లాట్లు వేలానికి రెడీగా ఉన్నాయని, త్వరలో వాటిని వేలం వేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేస్తామని హెచ్ఎండీఏ అధికారులు తెలిపారు.