హైదరాబాద్ లో మరోసారి భూముల వేలం

హైదరాబాద్ లో  మరోసారి భూముల వేలం
  •     బంజారాహిల్స్​లో 8, కొండాపూర్​లో 20, నియోపొలిస్​ వద్ద 70 ఎకరాల వేలానికి ఏర్పాట్లు
  •     మూడేండ్లలో రూ.30 వేల కోట్ల అభివృద్ధి పనులు చేపట్టేందుకు హెచ్ఎండీఏ ప్లాన్​ 

హైదరాబాద్​సిటీ, వెలుగు: ప్రభుత్వ భూములను వేలం వేసి భారీగా నిధులు  సమకూర్చుకునేందుకు హెచ్​ఎండీఏ సన్నాహాలు చేస్తున్నది. వేలం ద్వారా వచ్చే ఆదాయంతో హెచ్​ఎండీఏ పరిధిలో పలు అభివృద్ధి పనులు చేపట్టేందుకు అధికారులు ప్లాన్​ చేస్తున్నారు. వచ్చే మూడేండ్లలో రూ.30 వేల కోట్ల విలువైన ప్రాజెక్టులను చేపట్టడానికి అధికారులు ప్రణాళికలు రూపొందించారు. 

ఇందుకోసం బాండ్స్ ద్వారా రూ.20 వేల కోట్లు సేకరించాలని అధికారులు ఇప్పటికే నిర్ణయించారు. దీనికి సంబంధించి హెచ్ఎండీఏ ఆస్తులపై అప్పులు తీసుకునేందుకు ప్లాన్​ చేస్తున్నారు. దీనికోసం బ్యాంకర్లతో సంప్రదింపులకు ఒక కన్సల్టెన్సీని కూడా నియమించుకున్నారు. 

మంచి రేటు పలుకుతున్న భూములు

ఇటీవల కోకాపేటలో నిర్వహించిన వేలంలో 27 ఎకరాల భూమిని అమ్మడం ద్వారా హెచ్​ఎండీఏకు రూ.3,862.8 కోట్ల ఆదాయం సమకూరింది. అత్యధికంగా కోకాపేటలో ఎకరానికి రూ.151 కోట్లు పలకడంతో అధికారులు మరోసారి భూముల వేలానికి సిద్ధమవుతున్నారు. తాజాగా బంజారాహిల్స్​లోని ఫిలిం నగర్​లో ఇప్పటికే 8 ఎకరాల భూమిని ప్లాటింగ్​ చేశారు.  కొండాపూర్​లోని మరో 20 ఎకరాల భూమిని కూడా త్వరలోనే లేఔట్​చేసి అమ్మకానికి పెట్టాలని అధికారులు నిర్ణయించారు. కోకాపేటలోనే నియోపొలిస్ సమీపంలో హెచ్​ఎండీఏకు ఉన్న మరో 70 ఎకరాల భూమిని లేఔట్​చేసి వేలం వేసేందుకు  సిద్ధమవుతున్నారు. 

ఒక్క కోకాపేట భూముల వేలం ద్వారానే దాదాపు 8 వేల కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక ఉప్పల్ భగాయత్​లో మిగిలిపోయిన ప్లాట్లను వేలం చేయనున్నట్టు చెబుతున్నారు. ఇవే కాకుండా ల్యాండ్​పూలింగ్​ ద్వారా హెచ్​ఎండీఏ పరిధిలో భూములను రైతుల నుంచి సేకరించాలని నిర్ణయించారు. 

నగరంలో ఇప్పటికే హెచ్​ఎండీఏ రెండు చోట్ల ఎలివేటెడ్​కారిడార్​ల నిర్మాణానికి ప్లాన్​ రెడీ చేసింది. ఒకటి ఇప్పటికే ప్రారంభమవగా మరో ప్రాజెక్టు పనులు త్వరలోనే మొదలు కానున్నాయి. ఇవే కాకుండా బంజారాహిల్స్​ నుంచి కొండాపూర్​ వరకు మరో ఎలివేటెడ్​కారిడార్​ నిర్మాణానికి హెచ్​ఎండీఏ ప్రణాళిక సిద్ధం చేసింది. ఆయా ప్రాజెక్టులకు అవసరమైన నిధులను భూముల వేలం ద్వారా సమకూర్చుకోవాలని అధికారులు భావిస్తున్నారు.