
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, హత్యలకు నిరసనగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సోమవారం పార్టీ స్టేట్ ఆఫీసులో ఒక రోజు దీక్ష చేపట్టనున్నారు. దీక్షలో ఆయనతో పాటు మహిళా మోర్చా నేతలు పాల్గొననున్నారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండాపోయిందని, అఘాయిత్యాలు జరుగుతున్నా ప్రభుత్వం స్పందించడం లేదని బీజేపీ నేతలు మండిపడుతున్నారు. మహిళలకు బీజేపీ అండగా ఉంటుందని చెప్పేందుకే బండి సంజయ్ దీక్షకు దిగుతున్నారని తెలిపారు. ఇటీవల సీనియర్ స్టూడెంట్ సైఫ్ వేధింపుల వల్ల మెడికో ప్రీతి చనిపోయిందని, ఇది ముమ్మాటికీ హత్యేనని, ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రీతి కుటుంబానికి న్యాయం చేయాలంటూ శుక్రవారం సాయంత్రం హైదరాబాద్లోని బషీర్బాగ్ నుంచి ట్యాంక్ బండ్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. దీనికి కొనసాగింపుగా బండి సంజయ్ సోమవారం దీక్ష చేపట్టనున్నారు.