
- ఓజోన్ పొరకు రంధ్రం.. ఇండియా కన్నా 8 రెట్లు పెద్దది
- 2.48 కోట్ల చదరపు కిలోమీటర్ల మేర ఉందన్న నాసా
న్యూఢిల్లీ: సూర్యుడి నుంచి వచ్చే అల్ట్రావయొలెట్ (యూవీ) వంటి డేంజర్ కిరణాల నుంచి కాపాడే కవచంలా ఉన్న ‘ఓజోన్’ లేయర్ కరాబైపోతోంది. ఆ కవచానికి పడిన రంధ్రం నానాటికీ పెద్దదవుతోంది. పోయినేడాది లాగానే ఇప్పుడు కూడా ఓజోన్ పొరకు రంధ్రం పడిందని, అయితే, 2021లో ఓజోన్కు పడిన రంధ్రం ఇండియా కన్నా 8 రెట్లు పెద్దగా ఉందని అమెరికా అంతరిక్ష సంస్థ నాసా, నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్ఫెరిక్ అడ్మినిస్ట్రేషన్(ఎన్వోఏఏ) సైంటిస్టులు హెచ్చరించారు. రంధ్రం సైజు 2.48 కోట్ల చదరపు కిలోమీటర్లుందని చెప్పారు. సదరన్ హెమీస్ఫియర్లో ఏర్పడిన అతి చల్లని వాతావరణ పరిస్థితులే ఓజోన్ రంధ్రం పెద్దగవ్వడానికి కారణమైందని చెప్పారు. నవంబర్, డిసెంబర్ వరకు ఆ రంధ్రం అలాగే ఉండొచ్చన్నారు. 1979 నుంచి ఇప్పటిదాకా ఓజోన్కు పడిన రంధ్రాల్లో ఇది13వ అతిపెద్ద రంధ్రమని నాసా ఎర్త్సైన్సెస్ చీఫ్ సైంటిస్ట్ పాల్ న్యూమన్ చెప్పారు. వాతావరణంలోని క్లోరిన్, బ్రోమిన్ వంటి కెమికల్స్ స్థాయిలు పెరిగిపోవడం వల్లే ఓజోన్ లేయర్ మందం తగ్గి రంధ్రం పెరగడానికి కారణమైందని పేర్కొన్నారు.