
- 7-9 శాతం గ్రోత్కు అవకాశం
- వెల్లడించిన క్రిసిల్
న్యూఢిల్లీ : భారతీయ హోమ్ టెక్స్టైల్ ఇండస్ట్రీ గడ్డు పరిస్థితుల నుంచి బయటపడే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని తాజా స్టడీ ఒకటి వెల్లడించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆదాయం 7–-9శాతం పెరుగుతుందని క్రిసిల్ రేటింగ్స్ రిపోర్ట్ పేర్కొంది. ఇది గత ఆర్థిక సంవత్సరంలో ఏకంగా15 శాతం తగ్గింది. ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్న ఈ పరిశ్రమ ఇప్పుడు రికవరీ బాటలో ఉంది. హోమ్ టెక్స్టైల్ ఇండస్ట్రీ పునరుద్ధరణకు అనేక అవకాశాలు ఉన్నాయి. పత్తి ధరలు తగ్గుతున్నాయి. ఇది భారీ స్థాయిలో పెరిగింది. గత మే నెలలో ఒక్కో క్యాండీ ధర రూ. లక్షకు చేరుకుంది. అయినప్పటికీ, కొన్ని నెలల తరువాత దాదాపు రూ.55,000కి తగ్గింది.
అంతర్జాతీయ ధరలలో మార్పులే ఇందుకు కారణమని కంపెనీలు చెబుతున్నాయి. ఈ కరెక్షన్ ప్రపంచ మార్కెట్లో భారతదేశం మరింతగా పోటీపడే సామర్థ్యాన్ని గణనీయంగా పెంచింది. అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రధాన రిటైలర్లు భారతీయ హోం టెక్స్టైల్ తయారీదారుల నుంచి ఆర్డర్లను పెంచుతున్నారు. సరఫరా గొలుసు అంతరాయాలు, ఇటీవలి నెలల్లో అమ్మకాలు క్రమంగా పెరిగిన కారణంగా ఇన్వెంటరీ పెరిగింది. దీంతో డిమాండ్లో పెరుగుదల ఉంది. "ముడిసరుకు ధరలు ఇప్పుడు మరింత తగ్గాయి. ఫలితంగా అంతర్జాతీయ మార్కెట్లో మనం మరింత గట్టిగా పోటీ పడవచ్చు. అమెరికా రిటైలర్లు స్టాకును పెంచుకుంటున్నారు.
గ్లోబల్ బయర్లు చైనా ప్లస్ పాలసీని అనుసరిస్తున్నారు. ఫలితంగా ఈ ఆర్థిక సంవత్సరంలో భారతీయ హోమ్ టెక్స్టైల్ తయారీదారుల ఆదాయం పెరగొచ్చని మేం అంచనా వేస్తున్నాం" అని క్రిసిల్ రేటింగ్స్ సీనియర్ డైరెక్టర్ మోహిత్ మఖిజా అన్నారు. అమెరికా హోమ్ టెక్స్టైల్ దిగుమతుల్లో భారతదేశం వాటా ఈ సంవత్సరం మొదటి అర్ధభాగంలో 47శాతంకి పెరిగింది. 2022లో ఇది 44 శాతం, 2021లో 48శాతం ఉండేది. సామర్థ్యం పెంపు నెమ్మదిగా పెరుగుతుండటంతో ఆపరేటింగ్మార్జిన్లు మాత్రం కరోనాకు ముందుస్థాయి మాదిరే ఉండవచ్చని క్రిసిల్ రిపోర్ట్తెలిపింది.
స్టార్టప్లకు రూ. 50 లక్షల వరకు గ్రాంట్
టెక్నికల్ టెక్స్టైల్స్సెగ్మెంట్లో ఇన్నోవేషన్లను ప్రోత్సహించేందుకు స్టార్టప్లకు, వ్యక్తులకు రూ. 50 లక్షల వరకు గ్రాంట్-ఇన్-ఎయిడ్ అందించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. స్టార్టప్లకు - 18 నెలల వరకు రూ. 50 లక్షల వరకు -ఆర్థికసాయం అందిస్తామని జౌళి మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ రాజీవ్ సక్సేనా అన్నారు. నేషనల్ టెక్నికల్ టెక్స్టైల్స్ మిషన్లో భాగంగా టెక్నికల్ టెక్స్టైల్స్లో స్టార్టప్ ఎకోసిస్టమ్ను అభివృద్ధి చేయడానికి ప్రొటోటైప్లను టెక్నాలజీలుగా, ప్రొడక్టులను మార్చడానికి, కమర్షలైజేషన్కు ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు.
రాయల్టీలు లేదా ఈక్విటీ లేకుండా గ్రాంట్-ఇన్-ఎయిడ్ రూపంలో రూ. 50 లక్షల వరకు ఇస్తామని తెలిపారు. ఇంక్యుబేటీ నుంచి కనీసం 10 శాతం కంట్రిబ్యూషన్ ఉంటే చాలని, మిగతాది అంతా ఐఐటీలు, ఎన్ఐటీలు, టెక్స్టైల్స్ రీసెర్చ్ అసోసియేషన్లు, సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ వంటి ఇంక్యుబేటర్ల ద్వారా జరుగుతుందని ఆయన వివరించారు. 10–-15 రోజుల్లో దరఖాస్తులను ఆహ్వానించడానికి ఆన్లైన్ పోర్టల్ను అభివృద్ధి చేయనున్నట్లు సక్సేనా తెలిపారు.
ఈ పథకం కింద 100–-150 స్టార్టప్లకు మద్దతు ఇవ్వబోతున్నామని వెల్లడించారు. ఇంక్యుబేటర్లకు మొత్తం గ్రాంట్-ఇన్- ఎయిడ్లో 10 శాతాన్ని అదనంగా అందిస్తారు. టెక్స్టైల్స్ మంత్రిత్వ శాఖ 26 ఇన్స్టిట్యూట్లకు వారి లేబొరేటరీ మౌలిక సదుపాయాలను అప్గ్రేడ్ చేయడానికి, టెక్నికల్ టెక్స్టైల్స్ అప్లికేషన్ ఏరియాల్లో ట్రైనర్లకు శిక్షణ ఇవ్వడానికి కూడా అనుమతి ఇచ్చింది.