
షిల్లాంగ్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన రాజా రఘువంశీ హనీమూన్ మర్డర్ కేసు నిందితులకు షిల్లాంగ్ కోర్టు 8 రోజుల పోలీస్ కస్టడీ విధించింది. ప్రధాన నిందితురాలు సోనమ్, ఆమె ప్రియుడు రాజ్ కుష్వాహాతో పాటు ముగ్గురు సుపారీ కిల్లర్స్కు 8 రోజుల పోలీస్ కస్టడీ విధిస్తూ షిల్లాంగ్ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. బుధవారం (జూన్ 11) నిందితులకు వైద్య పరీక్షలు అనంతరం పోలీసులు షిల్లాంగ్ జిల్లా కోర్టులో హాజరుపర్చారు.
కేసుకు విచారణకు సంబంధించిన మరిన్నీ వివరాలు రాబట్టేందుకు నిందితులను 10 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని పోలీసులు న్యాయస్థానాన్ని కోరారు. పోలీసుల వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం నిందితులను 8 రోజులు పోలీస్ కస్టడీకి అప్పగించేందుకు ఒకే చెప్పింది. దీంతో పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని మరిన్నీ వివరాలు రాబట్టనున్నారు.
అసలేం జరిగింది?
మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన బిజినెస్మెన్ రాజా రఘువంశీకి అదే సిటీకి చెందిన బిజినెస్మెన్ దేవీసింగ్ రఘువంశీ కుమార్తె సోనమ్తో గత నెల 11న వివాహం జరిగింది. అదే నెల 20న రఘువంశీ, సోనమ్ మేఘాలయాకు హనీమూన్కు వెళ్లారు. 22న స్కూటర్ రెంట్కు తీసుకుని మౌలఖియాట్ అనే ప్రాంతానికి చేరుకున్నారు. ఇక ఆ తర్వాత నుంచి కనిపించకుండాపోయారు. ఈ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. కొత్త జంట జాడ కనిపెట్టేందుకు మేఘాలయా ప్రభుత్వం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్(సిట్) ఏర్పాటు చేసింది.
ఈ క్రమంలో జూన్ 2న ఓ జలపాతం దగ్గర లోయలో రాజా రఘువంశీ డెడ్బాడీ దొరికింది. అతని గోల్డ్ రింగ్, చైన్ మిస్ అయినట్టు పోలీసులు గుర్తించారు. ఆ తర్వాత స్పాట్కు దగ్గర్లోనే రక్తపు మరకలు ఉన్న కత్తి, రెయిన్ కోట్ దొరికింది. రఘువంశీ హత్యకు గురైనట్టు భావించిన పోలీసులు.. ఆయన భార్య సోనమ్ కోసం గాలింపు చేపట్టారు.
ALSO READ | అవును.. నేనే చంపేశా: పోలీసుల విచారణలో భర్త రాజాను చంపినట్లు ఒప్పుకున్న సోనమ్
ఈ క్రమంలో ఆదివారం రాత్రి ఉత్తరప్రదేశ్లోని వారణాసి, ఘాజీపూర్ హైవేపై ఆమె ఉన్నట్టు సమాచారం రావడంతో యూపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం నిందితులను మేఘాలయ సిట్ టీమ్ విచారించింది. ప్రియుడు రాజ్ కుష్వాహాతో కలిసి కిరాయి గుండాలతో భర్తను తానే హత్య చేయించినట్లు సోనమ్ సిట్ విచారణలో ఒప్పుకుంది.