5 లక్షల మంది టూరిస్టులకు హాంకాంగ్​ ఆఫర్​

5 లక్షల మంది టూరిస్టులకు హాంకాంగ్​ ఆఫర్​

హాంకాంగ్​:  టూరిస్టులను ఆకట్టుకునేందుకు హాంకాంగ్​ బంపర్​ ఆఫర్ ప్రకటించింది.  వందా వెయ్యి కాదు..  ఏకంగా 5 లక్షల విమాన టికెట్లను టూరిస్టులకు ఉచితంగా ఇస్తామని వెల్లడించింది. ఇందుకోసం ‘హలో హాంకాంగ్’ పేరుతో ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని హాంకాంగ్​ చీఫ్​ ఎగ్జిక్యూటివ్​ జాన్​ లీ గురువారం ప్రారంభించారు. పర్యాటకులను ఆకర్షించేందుకు  ఇప్పటివరకు మరే దేశమూ ఇంత పెద్ద ఆఫర్​ను  ప్రకటించలేదన్నారు. 

ఫ్రీ టికెట్​ స్కీం ఇలా.. 

హాంకాంగ్​కు చెందిన 3 ఎయిర్​లైన్స్​ కంపెనీలు కలిసి ఈ టూరిజం స్కీంను రూపొందించాయి. ఇది మార్చి నుంచి ఆగస్టు వరకు (ఆరు నెలల పాటు) అమలవుతుంది. మొత్తం 5 లక్షల ఫ్రీ విమాన టికెట్లు ఇచ్చేందుకు ఈ మూడు ఎయిర్​ లైన్స్​ కంపెనీలు దాదాపు రూ.2వేల కోట్లకు పైనే (2 బిలియన్ల హాంకాంగ్​ డాలర్లు) ఖర్చు చేస్తున్నాయి. 5 లక్షల మందికి చెరో ఎయిర్​ టికెట్​ను ఫ్రీగా ఇస్తే.. వారు మరో ఇద్దరిని హాంకాంగ్​కు తీసుకొస్తారని ఎయిర్​ లైన్స్​ కంపెనీలు అంచనా వేస్తున్నాయి. ఈ లెక్కన ఉచిత టికెట్ల పంపిణీ ద్వారా తమ దేశానికి  దాదాపు 15 లక్షల మంది టూరిస్టులు వస్తారని భావిస్తున్నాయి.  ఇక, ఉచితంగా టికెట్లు ఇచ్చే విషయానికి వస్తే.. వాటిని ‘ఒకటి కొంటే ఒకటి ఫ్రీ’ ఆఫర్​ ద్వారా టూరిస్టులకు కేటాయిస్తారు. 

లక్కీ డ్రాలు, గేమ్స్​లలో గెలిచిన టూరిస్టులకు..  ప్రమోషనల్​ ఆఫర్స్​ను సబ్​స్క్రైబ్ చేసుకున్నవారికి కూడా టికెట్​ను ఫ్రీగా అందిస్తారు.  హాంకాంగ్ పొరుగునే ఉండే మకావు (అటానమస్​ రీజియన్), గ్వాంగ్​ డాంగ్​ప్రావిన్స్​(చైనా)లకు వచ్చే టూరిస్టులకు మరో 2 లక్షల విమాన టికెట్లను ఈ స్కీం ద్వారా ఫ్రీగా అందించనున్నారు.  ఐసొలేషన్​, క్వారంటైన్​ లాంటి నిబంధనలేవీ లేవని.. టూరిస్టులు నిస్సంకోచంగా హాంకాంగ్​కు వచ్చి టూర్​ను ఎంజాయ్​ చేయాలని ఎయిర్​ లైన్స్​ కంపెనీలు కోరుతున్నాయి. 

మూడేళ్లుగా టూరిస్టులు రాకపోవడంతో.. 

హాంకాంగ్​ ఆర్థిక వ్యవస్థకు టూరిజమే ఆరో ప్రాణం. 2019 సంవత్సరంలో ఆ దేశంలో 5.6 కోట్ల మంది పర్యటించారు. ఇది ఆ దేశ జనాభా కంటే 8 రెట్లు ఎక్కువ. హాంకాంగ్​ జనాభా 74 లక్షలు.  2019 తర్వాత కరోనా వ్యాప్తి మొదలు కావడంతో సీన్​ రివర్స్​ అయింది.  చైనా పక్కనే ఉండటంతో..  మూడేళ్లుగా హాంకాంగ్​ కు వెళ్లే టూరిస్టుల సంఖ్య బాగా తగ్గిపోయింది. 2022 సంవత్సరంలో కేవలం 60 లక్షల మంది టూరిస్టులే ఆ దేశాన్ని విజిట్​ చేశారు.