
హాంకాంగ్: ఇండియా స్టార్ షట్లర్, రెండుసార్లు ఒలింపిక్ మెడలిస్ట్ పీవీ సింధు.. హాంకాంగ్ ఓపెన్లో విఫలమైంది. బుధవారం జరిగిన విమెన్స్ సింగిల్స్ తొలి రౌండ్లో సింధు 21–15, 16–21, 19–21తో అన్సీడెడ్ లైన్ క్రిస్టోఫర్సన్ (డెన్మార్క్) చేతిలో ఓడింది. 58 నిమిషాల మ్యాచ్లో ఆరంభంలో తెలుగమ్మాయి మంచి ఫామ్ చూపెట్టింది. 3–1తో గేమ్ను మొదలుపెట్టి 14–13తో నిలిచింది.
ఈ క్రమంలో క్రిస్టోఫర్సన్ ఒక పాయింట్ నెగ్గగా, సింధు వరుస పాయింట్లతో హోరెత్తించింది. రెండో గేమ్లో 13–12తో లీడ్లో ఉన్న సింధు ఆ తర్వాత వరుసగా ఐదు పాయింట్లు కోల్పోయి క్రమంగా వెనకబడింది. డిసైడర్లో ఇద్దరు ప్లేయర్లు 19–19 వరకు హోరాహోరీగా తలపడ్డారు. ఈ దశలో క్రిస్టోఫర్సన్ రెండు క్రాస్ కోర్టు పాయింట్లతో గేమ్, మ్యాచ్ను సొంతం చేసుకుంది.
మెన్స్ సింగిల్స్లో హెచ్.ఎస్. ప్రణయ్ 21–17, 21–14తో లు గుయాంగ్ జు (చైనా)పై, లక్ష్యసేన్ 22–20, 16–21, 21–15తో వాంగ్ జు వీ (చైనీస్తైపీ)పై, కిరణ్ జార్జ్ 21–16, 21–11తో జియా హెంగ్ జాసన్ (సింగపూర్)పై, ఆయుష్ షెట్టి 15–21, 21–19, 21–13తో సు లియ యాంగ్ (చైనీస్తైపీ)పై గెలిచి ప్రిక్వార్టర్స్లోకి అడుగుపెట్టారు. విమెన్స్ డబుల్స్లో శ్వేత పర్ణ–రుతు పర్ణ 17–21, 9–21తో ఒయ్ కి వానెసా పాంగ్–సుమ్ యు వాంగ్ (హాంకాంగ్)పై గెలవగా, ధ్రువ్ కపిల–తనీషా క్రాస్టో 16–21, 11–21తో చెన్ చెంగ్ కున్–సు యిన్ హుయ్ (చైనీస్తైపీ) చేతిలో ఓడారు. మిక్స్డ్ డబుల్స్లో రోహన్ కపూర్–గద్దె రుత్విక శివాని 14–21, 17–21తో ఫెంగ్ యాన్ జి–హుయాంగ్ డాంగ్ పింగ్ (చైనా) చేతిలో ఓడారు.