బీసీ హాస్టల్‌లో దారుణం.. అన్నం పెట్టమంటే కొడుతుండ్రు

బీసీ హాస్టల్‌లో దారుణం.. అన్నం పెట్టమంటే కొడుతుండ్రు

వికారాబాద్ జిల్లా నవాబుపేటలో దారుణం చోటుచేసుకుంది. అన్నం అడిగిన విద్యార్థులను వాచ్ మెన్ చర్మం కమిలిపోయేలా కొట్టాడు. ఈ సంఘటన మండల కేంద్రంలోని  బీసీ బాయ్స్ హాస్టల్ లో జరిగింది. పిల్లలకు సరిగా భోజనం పెట్టకుండా విద్యార్థులను హింసిస్తూ, పెట్టింది తినాలంటూ వేధిస్తున్నారు.

భోజనం సరిగా పెట్టకుండా, అన్నం తక్కువ తినాలంటూ హాస్టల్ వార్డెన్, విద్యార్థులకు ఆంక్షలు విధించారు. అంతే కాదు అన్నం పెట్టమని అడిగినందుకు విద్యార్థులను బూతులు తిడుతూ, వార్డెన్ తో పాటు, వాచ్ మెన్ సైతం చితకబాదారు. దీంతో విద్యార్థుల చర్మం కమిలిపోయేలా వాతలు కూడా పడ్డాయి. వార్డెన్ కనీస శుభ్రత పాటించకుండా భోజనం పెడుతున్నారని, అర లీటర్ పాలతో 40 మంది విద్యార్థులకు సరిపెడుతున్నారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. హాస్టల్ కి తాగి వచ్చి తమ తల్లిదండ్రులను బూతులు తిడుతూ, తమను ఇష్టం వచ్చినట్టు కొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

అన్నం తక్కువ తినాలని, ఉప్పు ఎక్కువ వేయిస్తున్నాడు అంటూ విద్యార్థులు చెప్పుకొచ్చారు. ఇక్కడ పెట్టే భోజనం తింటే తమ ప్రాణాలు పోతాయని, ఈ వార్డెన్ తమకొద్దు అంటూ విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. విద్యార్థులకు న్యాయం జరిగేలా ఉన్నతాధికారులు స్పందించి హాస్టల్ వార్డెన్ పై, వాచ్ మెన్ పై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.