- జనవరి నుండి రూ. 12 వేల కోట్ల విలువైన సేల్స్
- 1,000, - 2,000 చ.అ. ఇండ్లకు మస్తు గిరాకీ
- ఏప్రిల్లో రూ. 2,767 కోట్ల విలువైన ఇండ్లు అమ్మకం
- వెల్లడించిన నైట్ ఫ్రాంక్ ఇండియా రిపోర్టు
హైదరాబాద్, వెలుగు: కరోనా, యుద్ధం, ఇన్ఫ్లేషన్ వంటి సమస్యలేవీ హైదరాబాద్ రియల్టీ పరుగును అడ్డుకోలేకపోతున్నాయి. ఈ ఏడాదిలో ఏప్రిల్ వరకు హైదరాబాద్లో రూ.12 వేల కోట్ల విలువైన ఇండ్లు అమ్ముడయ్యాయని రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ నైట్ ఫ్రాంక్ ఇండియా ప్రకటించింది. దీని ప్రకారం... ఏప్రిల్లో హైదరాబాద్లో 5,331 ఆస్తుల అమ్మకాలు రికార్డయ్యాయి. మొత్తం అమ్మకాల్లో హైదరాబాద్ రెసిడెన్షియల్ మార్కెట్లో (మేడ్చల్–మల్కాజిగిరి, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాలు కలిపి) వాటా 15 శాతం వరకు ఉంది. ఈ మార్కెట్లో అన్ని కేటగిరీల ప్రాపర్టీల ధరలు పెరిగాయి. ఈ ఏడాది ప్రారంభం నుంచి రెసిడెన్షియల్ ఆస్తుల మొత్తం రిజిస్ట్రేషన్లు 24,797 యూనిట్లకు చేరుకున్నాయి. 2022 ఏప్రిల్లో లావాదేవీలు జరిపిన ఆస్తుల మొత్తం విలువ రూ. 2,767 కోట్లకు చేరుకుంది (ఏడాది లెక్కన 10శాతం పెరుగుదల). 2022 జనవరి నుండి రిజిస్టర్ అయిన అన్ని ఆస్తుల పూర్తి విలువ రూ. 11,998 కోట్లకు చేరింది. అయితే పోయిన ఏప్రిల్తో పోలిస్తే ఈసారి ఏప్రిల్ ఆస్తి రిజిస్ట్రేషన్ల సంఖ్య 10 శాతం తగ్గింది. హైదరాబాద్ రెసిడెన్షియల్ మార్కెట్లో హైదరాబాద్, మేడ్చల్ -మల్కాజిగిరి, రంగారెడ్డి సంగారెడ్డి జిల్లాలు ఉంటాయి.
రూ. 25-రూ. 50 లక్షల కేటగిరీకీ గిరాకీ
2022 ఏప్రిల్లో రికార్డయిన రెసిడెన్షియల్ అమ్మకాలలో రూ. 25 లక్షలు – 50 లక్షల మధ్య ధర గల ఇండ్ల అమ్మకాల వాటా 53శాతం ఉంది. రూ. 25 లక్షలు కంటే తక్కువ ధర గల యూనిట్ల వాటా 17శాతమే ఉంది. 2022 ఏప్రిల్లో ఇతర టిక్కెట్-సైజ్ విభాగాల అమ్మకాల రిజిస్ట్రేషన్లు ఏడాది లెక్కన కొంచెం పెరిగాయి. వెయ్యి చదరపు అడుగుల కంటే ఎక్కువ విస్తీర్ణంలో ఉన్న యూనిట్ల అమ్మకాల వాటా 2022 ఏప్రిల్లో జరిగిన మొత్తం ఇండ్ల అమ్మకాల రిజిస్ట్రేషన్లలో సుమారు 83 శాతం వరకు ఉంది. వెయ్యి నుంచి రెండు వేల చదరపు అడుగుల మధ్య ఉండే ఇండ్ల వాటా 72శాతం వరకు ఉంది. ఇండ్ల కొనుగోలుదారులు అప్గ్రేడేషన్ కోసం పెద్ద బంగళాలు కొనడం పెరిగింది. 2022 ఏప్రిల్లో మేడ్చల్ -మల్కాజిగిరి జిల్లాలో ఇండ్ల రిజిస్ట్రేషన్లు 44శాతం రికార్డు కాగా, రంగారెడ్డి జిల్లాలో 40శాతం రికార్డు అయ్యాయి. 2022 ఏప్రిల్లో మొత్తం రిజిస్ట్రేషన్లలో హైదరాబాద్ మార్కెట్ వాటా 15శాతం ఉంది. రెసిడెన్షియల్ ప్రాపర్టీల సగటు ధరలు 2022 ఏప్రిల్లో సంవత్సరం లెక్కన 20శాతం పెరిగాయి. సంగారెడ్డి ప్రాంతంలో ధరలు 2022 ఏప్రిల్లో అత్యధికంగా 36శాతం పెరిగాయి. ఇటీవలి కాలంలో హైదరాబాద్ జిల్లాలో ధరల పెరుగుదల బాగా ఉంది. 2022 ఏప్రిల్లో హయ్యర్ వాల్యూ ప్రాపర్టీల ఆస్తుల అమ్మకాలు పెరిగాయి. హైదరాబాద్ జిల్లాలోని అన్ని మైక్రో-మార్కెట్లలో వెయిటెడ్ సగటు ధర పెరిగిందని నైట్ఫ్రాంక్ రిపోర్టు పేర్కొంది.
జిల్లాల వారీగా అమ్మకాలు ఇలా ఉన్నాయి
జిల్లా ఏప్రిల్ 2021 2022 ఏప్రిల్
(సంఖ్యలన్నీ శాతాల్లో)
హైదరాబాద్ 15 15
మేడ్చల్
మల్కాజిగిరి 41 44
రంగారెడ్డి 39 40
సంగారెడ్డి 5 1