న్యూఢిల్లీ: టీ20 వరల్డ్ కప్లో వరుస విజయాలతో జోష్లో ఉన్న న్యూజిలాండ్కు బ్యాడ్ న్యూస్. ఆ జట్టు స్టార్ ఆల్ రౌండర్ మైఖేల్ బ్రేస్వెల్ టీ20 వరల్డ్ కప్కు దూరమయ్యాడు. ఎడమ కాలికి గాయం కావడంతో ఈ 34 ఏళ్ల ఆల్ రౌండర్ మెగా టోర్నీ నుంచి వైదొలిగాడు. బ్రేస్ వెల్ స్థానంలో కోల్ మెక్కాంచీని ఎంపిక చేసినట్లు న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు వెల్లడించింది. ఫిబ్రవరి 13న దక్షిణాఫ్రికాతో అహ్మదాబాద్లో జరగనున్న మ్యాచ్కు ముందు అతడు జట్టులో చేరుతాడని తెలిపింది.
2026, జనవరిలో భారత్తో జరిగిన వన్డే సిరీస్లో బ్రేస్వెల్ గాయపడ్డాడు. అతడి ఎడమ కాలికి తీవ్ర గాయమైంది. దీంతో బ్రేస్వెల్ ఇండియాతో జరిగిన టీ20 సిరీస్కు దూరమయ్యాడు. తిరిగి కోలుకున్న ఈ ఆల్ రౌండర్ ప్రపంచ కప్ జట్టుకు ఎంపికయ్యాడు. కానీ వరల్డ్ కప్లో గాయం తిరగబెట్టడంతో మెగా టోర్నీ నుంచి అర్ధాంతరంగా తప్పుకోవాల్సి వచ్చింది.
బ్రేస్ వెల్ గాయంపై న్యూజిలాండ్ హెడ్ కోచ్ రాబ్ వాల్టర్ స్పందించారు. ‘‘న్యూజిలాండ్ తరుఫున వరల్డ్ కప్ ఆడటం బ్రేస్వెల్కు ఎంత ముఖ్యమో నాకు తెలుసు.. ఇందు కోసం అతడు చాలా కష్టపడ్డాడు. కానీ దురదృష్టవశాత్తు గాయం కారణంగా టోర్నీ నుంచి అతడు తప్పుకోవాల్సి వచ్చింది. బ్రేస్వెల్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా’’ అని పేర్కొన్నాడు.
►ALSO READ | T20 World Cup: టీమిండియాకు బిగ్ షాక్: ఆసుపత్రిలో చేరిన అభిషేక్ శర్మ.. ఏమైందంటే..?
ఇండియా, శ్రీలంక సంయుక్తంగా అతిథ్యమిస్తోన్న టీ20 వరల్డ్ కప్లో న్యూజిలాండ్ వరుస విజయాలతో దుమ్మురేపుతోంది. మిచెల్ సాంటర్ నేతృత్వంలోని బ్లాక్ క్యాప్స్ టోర్నమెంట్ను అద్భుతంగా ఆరంభించారు. ఆఫ్ఘనిస్తాన్, యూఏఈ జట్లపై వరుస విజయాలు సాధించింది. యూఏఈపై అయితే ఏకంగా 10 వికెట్ల తేడాతో వరల్డ్ రికార్డ్ విజయం సాధించారు.
