వైవీ సుబ్బారెడ్డి చేతికి నా ఆడియో ఎలా వచ్చింది? ఫోన్ ట్యాపింగ్ కేసులో నిజానిజాలు తేల్చాలి: వైఎస్ షర్మిల

వైవీ సుబ్బారెడ్డి చేతికి నా ఆడియో ఎలా వచ్చింది? ఫోన్ ట్యాపింగ్ కేసులో నిజానిజాలు తేల్చాలి: వైఎస్ షర్మిల

అమరావతి, వెలుగు: ఫోన్ ట్యాపింగ్​కేసులో నిజాలు నిగ్గు తేల్చాలని ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు. తన ఫోన్ ను ట్యాప్ చేశారని.. అలా ట్యాప్ చేసిన ఆడియోను ఒక దాన్ని వైవీ సుబ్బారెడ్డి ఇంటికి వచ్చి తనకు వినిపించారని ఆమె తెలిపారు. బైబిల్ మీద, నా బిడ్డల మీద ప్రమాణం చేసి చెప్తున్న.. నా ఫోన్ ట్యాపింగ్ వాయిస్ నేను విన్నాను అని ఆమె అన్నారు. ట్యాపింగ్ జరిగిందనేందుకు ఇదే రుజువు అని చెప్పారు. 

గురువారం (June 19) ఏపీలో శ్రీకాకుళంలో ఆ రాష్ట్ర పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల మీడియాతో మాట్లాడారు. వైవీ సుబ్బారెడ్డి చేతికి తన ఆడియో ఎలా వచ్చిందని, ఎవరు ఇచ్చారని ఆమె ప్రశ్నించారు. ట్యాపింగ్ కేసును ఎంక్వైరీ చేస్తున్న తెలంగాణ పోలీసులు సుబ్బారెడ్డిని విచారణకు పిలవాలని డిమాండ్ చేశారు. తన ఆరోపణలపై సుబ్బారెడ్డి స్పందించాలని, ఆయన కుటుంబంపై ప్రమాణం చేసి వాస్తవాలు చెప్పాలన్నారు. 

ట్యాపింగ్ వెనుక వైఎస్​జగన్, కేసీఆర్ ఉన్నారని, వారిద్దరు నీచమైన రాజకీయాలు చేశారని షర్మిల ఆరోపించారు. తనను రాజకీయంగా ఎదగకుండా అడ్డుకున్నారని, అణచివేయాలని చూశారని తెలిపారు. తనపై నిఘా పెట్టి, ఎవరిని కలుస్తున్నానో తెలుసుకొని వారిని దూరం చేశారని చెప్పారు. సుబ్బారెడ్డితో అప్పట్లో సన్నిహితంగా ఉండేదాన్ని, అందుకే ఆయన ఆడియో వినిపించాడన్నారు. వందలాది ఫోన్లు ట్యాప్ అయ్యాయని.. అందరికీ న్యాయం జరగాలని ఆమె అన్నారు. తెలంగాణ పోలీసులు విచారణను స్పీడప్​చేయాలని షర్మిల డిమాండ్ చేశారు.