- రాష్ట్ర సర్కారుకు హైకోర్టు నోటీసులు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ప్రైమరీ స్కూళ్లలో స్టూడెంట్లకు పెట్టే మధ్యాహ్న భోజనానికి ఎంత బడ్జెట్ కేటాయించారో చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు ఇచ్చింది. చాలీచాలని నిధుల కేటాయింపులపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. అరకొర నిధుల కారణంగా మిడ్ డే మీల్స్లో నాణ్యతలేని ఆహారం పెడుతున్నారని, ఉడకని అన్నం, నీళ్ల పప్పుచారు పెడుతున్నారని పత్రికల్లో వచ్చిన వార్తల క్లిప్పింగ్స్ను జతచేస్తూ ఉస్మానియా వర్సిటీకి చెందిన బి. ఆకాష్ కుమార్ హైకోర్టుకు లెటర్ రాశారు. దీనిని పిల్గా పరిగణించిన హైకోర్టు చీఫ్ జస్టిస్ సతీష్ చంద్రశర్మ, జస్టిస్ అభినంద్కుమార్ షావిలితో కూడిన ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. చీఫ్ సెక్రటరీ, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్, ఫైనాన్స్, పాఠశాల విద్యా శాఖల ముఖ్య కార్యదర్శులు, పాఠశాల విద్యా శాఖ డైరెక్టర్లకు నోటీసులు ఇచ్చింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.