
- ఎయిర్పోర్ట్ మెయిన్ టర్మినల్ సమీపంలో పడ్డ క్షిపణి
- 25 మీటర్ల లోతు ఏర్పడ్డ గొయ్యి.. 8 మందికి గాయాలు
టెల్ అవీవ్: ఇజ్రాయెల్ విమానాశ్రయంపై హౌతీలు మిస్సైల్తో దాడి చేశారు. యెమెన్ నుంచి హౌతీలు ప్రయోగించిన క్షిపణి.. టెల్ అవీలోని బెన్ గురియన్ విమానాశ్రయం ప్రధాన టెర్మినల్ సమీపంలో పడటంతో ఎనిమిది మంది గాయపడ్డారు. ఆ ప్రాంతంలో 25 మీటర్ల లోతులో గొయ్యి ఏర్పడింది. క్షిపణి దాడితో విమానాశ్రయంలో కార్యకలాపాలు కొద్దిసేపు నిలిచిపోయాయి. క్షిపణిని అడ్డుకునేందుకు తాము చేసిన అనేక ప్రయత్నాలు విఫలమయ్యాయని, విమానాశ్రయం సమీపంలో ల్యాండ్ అయ్యేలోపు పొగలు కమ్ముకున్నాయని ఇజ్రాయెల్ రక్షణ దళాలు (ఐడీఎఫ్) తెలిపాయి.
ఇజ్రాయెల్కు ఫ్లైట్స్ బంద్: ఎయిర్ ఇండియా
ఇజ్రాయెల్ రాజధాని టెల్అవీవ్కు భారత్నుంచి 2 రోజులపాటు విమాన సేవలు నిలిచిపోయాయి. ఆదివారం ఉదయం బెన్ గురియన్ విమానాశ్రయంలో హౌతీ తిరుగుబాటుదారులు క్షిపణి దాడి చేసిన నేపథ్యంలో ఎయిర్ ఇండియా ఈ నిర్ణయం తీసుకున్నది. ఈ సంఘటన తర్వాత ఢిల్లీ నుంచి టెల్ అవీవ్కు వెళ్లే విమానాన్ని అబుదాబికి మళ్లించామని ఎయిర్లైన్స్ ఒక ప్రకటనలో తెలిపింది. చెల్లుబాటు అయ్యే టిక్కెట్లు ఉన్నవారికి మినహాయింపు లేదా రీషెడ్యూల్ చేసుకునే అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చింది. ప్రయాణికులు, సిబ్బంది భద్రత కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎయిర్ ఇండియా తెలిపింది.