రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో వర్ష బీభత్సం

రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో వర్ష బీభత్సం

వికారాబాద్, వెలుగు: ఈ నెలలో వారం పాటు ఆగకుండా పడిన వానకు రంగారెడ్డి, వికారాబాద్​జిల్లాల్లోని రైతులు నష్టపోగా, సోమవారం అర్ధరాత్రి నుంచి మంగళవారం రాత్రి 12 గంటల వరకు కురిసిన భారీ వర్షం నిండా ముంచింది. చాలా చోట్ల పంటలు కొట్టుకుపోయాయి. మొక్క దశలో ఉన్నవి పూర్తిగా కుళ్లిపోయాయి. పొలాలు కోతకు గురయ్యాయి. నవాబ్​పేట, ధారూర్, పూడూరు, పెద్దేముల్, కోటపల్లి, మోమిన్ పేట, తాండూరు, యాలాల మండలాల్లో అధిక పంట నష్టం జరిగినట్లు రైతులు చెబుతున్నారు. ధారూర్ మండల పరిధిలోని మైలారం, నాగారం, మోమిన్ ఖుర్దు, మోమిన్ కలాన్ గ్రామాల్లో నష్టపోయిన రైతులు ఎకరానికి రూ.20వేలు చొప్పున నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్​ చేస్తున్నారు. కౌలు రైతులు లబోదిబోమంటున్నారు. అప్పు తెచ్చి పంటలు వేశామని, వర్షం తీవ్ర నష్టం కలిగించిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయ శాఖ అధికారులు భారీ వర్షాలత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. ఈ నెల మొదటి వారంలో కురిసిన వానకు జరిగిన పంట నష్టాన్ని తేల్చామని, తాజా వర్షాలకు సంబంధించి ఇప్పుడే సర్వే చేసే పరిస్థితి లేదని చెబుతున్నారు.

టమోటా, మిర్చి, క్యాలీఫ్లవర్, పత్తి, మొక్కజొన్న, వరి పంటలు పూర్తిగా దెబ్బతిన్నట్లు రైతులు వాపోతున్నారు. వరుస వానలతో చిరువ్యాపారులు కూడా నష్టపోతున్నారు. బుధవారం రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం రేగడిదోస్వాడ, చేవెళ్ల మండలం ఘనాపూర్ లో మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే కాలె యాదయ్య పర్యటించారు. దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. ఈసీ, మూసీ నదుల పరివాహక ప్రాంతాల్లోని నష్టాన్ని ఎమ్మెల్యే .. మంత్రికి వివరించారు. పంటల నష్టంపై వికారాబాద్​జిల్లా వ్యవసాయ అధికారి గోపాల్​ను వివరణ కోరగా.. వర్షం నీరు పొలాల నుంచి వెళ్లిపోయాక కొన్ని పంటలు కోలుకుంటాయని, తర్వాతే నష్టాన్ని అంచనా వేస్తామని తెలిపారు. నీట మునిగిన, కొట్టుకుపోయిన పంటల వివరాలు తమ వద్ద లేవని చెప్పారు.