హైదరాబాద్, వెలుగు :కంపు కొట్టే హుస్సేన్ సాగర్ లాక్డౌన్తో ఊపిరి పీల్చుకుంటోంది. నాలాల నుంచి సివరేజీ, కెమికల్ వ్యర్థాలు ఆగిపోవడంతో క్లీన్గా మారుతోంది. నురగలు, దుర్వాసన, నాచు తగ్గుతోంది. ఆహ్లాదం కోసం ట్యాంక్బండ్కు వెళ్తే ముక్కు మూసుకునే పరిస్థితి నుంచి స్వచ్ఛమైన గాలి పీల్చుకునే అవకాశం కనిపిస్తోంది. తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు(టీపీసీబీ) లెక్కలు ఈ విషయం స్పష్టంచేశాయి. ఈ నెల10, 16 తేదీల్లో సాగర్ నీటిని టెస్ట్ చేయగా.. నమూనాల్లో డీఓ లెవల్స్ మెరుగుపడ్డట్లు పీసీబీ అధికారులు తెలిపారు. కోలిఫామ్ కారకాలు, పీహెచ్ లెవల్స్తోపాటు డీజాల్వ్డ్ ఆక్సిజన్, బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్, నైట్రేట్ లెవల్స్ కూడా తగ్గినట్లు పేర్కొన్నారు. లాక్డౌన్తో జీడిమెట్ల, పటాన్చెరు ఇండస్ట్రియల్ ఏరియాల్లోని కంపెనీలు మూతపడడం వల్ల వాటి నుంచి కెమికల్ వ్యర్థాలు ఆగిపోయాయి. దాంతోనే సాగర్లో వాటర్ క్వాలిటీ పెరుగుతున్నట్టు తెలుస్తోంది.
గేట్లాక్ ఏర్పాటు చేస్తే..
హుస్సేన్ సాగర్లోకి బల్కాపూర్, బంజారా, పికెట్ నాలాల నుంచి సివరేజ్ వాటర్, కూకట్పల్లి, జీడిమెట్ల నాలాల ద్వారా ఇండస్ట్రియల్, కెమికల్ వేస్టేజీ వచ్చి చేరుతుంది. నాలాల నుంచి వచ్చే మురుగు, వ్యర్థాలను మొదటగా ఎస్టీపీల్లోకి మళ్లించి, అక్కడ క్లీన్ చేసిన తర్వాత మూసీలోకి వదులుతారు. ప్రస్తుతం కూకట్పల్లి నాలా నుంచి వచ్చే సివరేజీ నీళ్లు నేరుగా సాగర్లోకి వెళ్తున్నాయి. నార్మల్ డేస్లో హుస్సేన్సాగర్లోని 150 ఎంఎల్డీల వ్యర్థజలాలు వస్తుండగా, ఇప్పుడు 50 ఎంఎల్డీ లోపే ఉంటున్నాయని హెచ్ఎండీఏ చెబుతోంది. కూకట్పల్లి, జీడిమెట్ల నాలా వ్యర్థాలు సాగర్లో కలవకుండా 2011లో ఐ అండ్ డీ(ఇంటరప్షన్ అండ్ డైవర్షన్) నిర్మాణం చేపట్టారు. ప్రస్తుతం ఆ పనులు తుది దశకు చేరాయి. గేట్లాక్ ఏర్పాటు చేస్తే పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తుంది కాబట్టి సాగర్ లో కలిసే వ్యర్థాలు పూర్తిగా ఆగిపోతాయని అధికారులు పేర్కొంటున్నారు.
రెండ్నెళ్లుగా బయో రెమిడియేషన్
హుస్సేన్ సాగర్ వాటర్ను క్లీన్ చేయడంతో పాటు ఆక్సిజన్ లెవల్స్పెంచేందుకు హెచ్ఎండీఏ 2 నెలలుగా బయో రెమిడియేషన్ చేస్తోంది. కెనడా టెక్నాలజీతో కిందటేడు తాత్కాలిక ప్రాతిపదికన చేపట్టినా మధ్యలోనే వదిలేసింది. మళ్లీ పూర్తిస్థాయిలో చేస్తోంది. ప్రస్తుతం సాగర్లోకి నీటి ప్రవాహం తక్కువగా ఉండడం, కెమికల్ వ్యర్థాలు కలవకపోవడంతో మంచి ఫలితాలు వస్తున్నాయని అధికారులు చెప్తున్నారు.
వాటర్ టెస్టింగ్ అవసరం
లాక్ డౌన్ తో ఫ్యాక్టరీ వ్యర్థాల ప్రభావం సాగర్లో కొంత మేర తగ్గొచ్చు. కెమికల్ వేస్టేజ్ కలుస్తుందని కొన్నేళ్లుగా పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తంచేస్తున్నా పీసీబీ కొట్టిపారేస్తోంది. ఈ టైమ్లో నీటిని టెస్ట్ చేసి పరిశీలిస్తే సమస్య ఎక్కడుందో అర్థమవుతుంది. లాక్ డౌన్ తర్వాత కూడా కెమికల్ వేస్టేజీ కలవకుండా చూడాలె.
– లుబ్నా సార్వత్, సోషల్ యాక్టివిస్ట్