- భూములమ్మి డబ్బులు ఖర్చు పెడితే ధనిక రాష్ట్రం అయితదా..?
- తన పేరు ఉండాలనే గుళ్లు, సచివాలయం కూలగొట్టిండు
హుజూరాబాద్, వెలుగు: కేసీఆర్.. సీఎం కాదని, నిజాం వారసుడిలా ప్రవర్తిస్తున్నారని హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. తెలంగాణ ధనిక రాష్ట్రం అని ప్రగల్భాలు పలికిన కేసీఆర్.. ఉద్యోగులకు సక్కగా జీతాలు ఇవ్వలేకపోతున్నారని ఆరోపించారు. తాత సంపాదించిన ఆస్తులు మనుమడు అమ్ముకున్నట్టు.. ఆస్తులు అమ్ముకొని సోకులు చేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ‘‘భూములు అమ్ముకొని ఖర్చు పెడితే ధనిక రాష్ట్రం అవుతుందా ? మద్యం అమ్మి డబ్బులు సంపాదిస్తే ధనిక రాష్ట్రం అవుతుందా? ఉత్పత్తులు పెరిగితే ధనిక రాష్ట్రం అవుతుందా’’ అని ప్రశ్నించారు. శనివారం హుజూరాబాద్ క్యాంపు ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడారు. కాకతీయ రాజులు కట్టిన దేవాలయాలు, అంతకు ముందు కట్టిన ఎన్నో పురాతన ఆలయాలు ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉన్నాయని, యాదాద్రిలో మాత్రం ఒక్క వర్షానికే గుడిలోకి నీళ్లు వచ్చాయని ఈటల రాజేందర్ అన్నారు. తన ముద్ర ఉండాలని పాత గుడిని కూలగొట్టి కట్టిన గొప్ప గుడిలో ఒక్క వర్షానికి నీళ్లు వచ్చాయి.. రోడ్లు కుంగాయి.. టాయిలెట్లు లేవని విమర్శించారు. స్వయంభూ ఇంజనీర్ అని చెప్పుకొనే సీఎం కేసీఆర్.. 30 సార్లు గుడికి పోయాడంట.. మరి గుడి ఎలా కడుతున్నరో చూడలేదా? అని ప్రశ్నించారు. పాత సచివాలయంలో అన్నీ బ్లాక్లు కొత్తగానే ఉన్నా కేవలం వాస్తు కోసం కూలగొట్టారని ఆరోపించారు. ఇతర సీఎంల పేర్లు ఉన్న శిలాఫలకాలు ఉండొద్దని, పేరు ప్రతిష్టల కోసం.. ఆనాడు చక్రవర్తులు ఎలా చేశారో ఇయ్యాల కేసీఆర్ అలానే చేస్తున్నారని మండిపడ్డారు.
ఎఫ్సీఐవి దాడులు కాదు.. లెక్కలు తేలుస్తన్నయ్
మిల్లులపై ఎఫ్సీఐ దాడులు చేస్తుంది అనడం తప్పని, వారు వడ్ల లెక్కలు తేలుస్తున్నారని ఈటల పేర్కొన్నారు. రైస్ మిల్లులకు సబ్సిడీ ఇవ్వలేదని, ఈ విషయంపై ఏడేండ్ల కింద మీటింగ్ పెట్టిన కేసీఆర్.. ఇప్పటి వరకు దాని ఊసే ఎత్తలేదని ఆరోపించారు.