
మందమర్రి, వెలుగు: పెండ్లికొడుకు తనను మోసం చేశాడంటూ మరో యువతి పీటల మీద పెండ్లిని అడ్డుకుంది. మంచిర్యాల జిల్లా క్యాతన్పల్లి మున్సిపాలిటీ అమ్మాగార్డెన్స్(ఆర్కేపీ రాంనగర్)కు చెందిన బొద్దుల శ్రీనివాస్, పద్మ దంపతుల కొడుకు రాజేశ్ పెండ్లి గోదావరిఖనికి చెందిన యువతితో నిశ్చయించారు. మందమర్రి మండలం గద్దెరాగడిలోని భీమా గార్డెన్స్లో బుధవారం ఉదయం 10 గంటలకు పెండ్లి జరుగుతుండగా తాళి కట్టే సమయంలో కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ సమీపంలోని అగ్రహారం గ్రామానికి చెందిన గోర్ల రమీనా అడ్డుకుంది. తనను ప్రేమించి మరొకరిని ఎలా పెండ్లి చేసుకుంటున్నావంటూ పీటలపైకి వెళ్లి నిలదీసింది. అవాక్కయిన కుటుంబసభ్యులు తేరుకొని పెండ్లిని అడ్డుకున్న యువతిని చితకబాదారు. ఆమె వద్ద ఉన్న సెల్ఫోన్ లాక్కొని ఫంక్షన్హాల్ నుంచి బయటకు పంపించారు. ఈ గందరగోళ పరిస్థితుల్లో పెండ్లికొడుకు తల్లిదండ్రులు స్పృహ కోల్పోవడంతో బంధువులు మంచిర్యాల ఆసుపత్రికి తరలించారు.
పెళ్లి అడ్డుకోవడానికి ముందే యువతి 100కు డయల్ చేసి స్థానిక పోలీసులకు సమాచారం అందించింది. మరో యువతి వచ్చి పెళ్లి అడ్డుకోవడంతో పెళ్లికూతురు బంధువులు పెండ్లికొడుకు రాజేశ్ను నిలదీశారు. ఓ దశలో దాడికి ప్రయత్నించగా అప్పటికే అక్కడికి చేరుకున్న రామకృష్ణాపూర్పట్టణ ఎస్సై అశోక్, పోలీసులు సర్దిచెప్పారు. ఇరుకుటుంబాల మధ్య రాజీ చేసేందుకు టీఆర్ఎస్ పార్టీకి చెందిన కౌన్సిలర్లు, లీడర్లు ప్రయ్నతించగా పెండ్లికూతురు కుటుంబసభ్యులు ఒప్పుకోలేదు. సాయంత్రం అమ్మా గార్డెన్లోని పెండ్లికొడుకు ఇంటి ఎదుట పెండ్లికూతురు కుటుంబసభ్యులు ధర్నాకు దిగారు. రాజేశ్పై రమీనా రామకృష్ణాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. గతంలో తన బావతో పెండ్లి జరిగితే విడాకులు తీసుకున్నట్లు పేర్కొంది. రాజేశ్ హైదరాబాద్లో ఎలక్ట్రికల్ ఇంజనీర్గా పని చేస్తున్నాడని, హనుమకొండలో తాను ఫార్మసీ చేస్తున్న టైమ్లో పరిచయమయ్యాడని తెలిపింది. నాలుగేళ్లుగా ప్రేమిస్తున్నానని, పెండ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని ఆరోపించింది. మరో యువతితో పెండ్లి కుదుర్చుకున్న విషయం తనకు తెలియదని, మంగళవారం రాత్రి కూడా తనతో రాజేశ్ ఫోన్లో చాటింగ్ చేశాడని చెప్పింది. అతడికి మరో యువతితో పెండ్లి జరుగుతున్నట్లు తెలిసిన వెంటనే వచ్చి అడ్డుకున్నట్లు తెలిపింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.