
- బాబు అనారోగ్యంతో బయటపడిన దారుణం
- పిల్లాడి డీఎన్ఏకు, తండ్రి డీఎన్ఏకు సంబంధం లేదని వైద్య పరీక్షల్లో వెల్లడి
- పోలీసుల అదుపులో సెంటర్ నిర్వాహకురాలు
పద్మారావునగర్, వెలుగు: భర్త వీర్యానికి బదులు వేరొక వ్యక్తి వీర్యంతో ఐవీఎఫ్ చేశారు ఆ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ డాక్టర్లు. సికింద్రాబాద్ గోపాలపురంలో ఉన్న సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ లో ఈ నిర్వాకం వెలుగులోకి వచ్చింది. బాధితుల ఫిర్యాదుతో శనివారం నార్త్జోన్ డీసీపీ రష్మీ పెరుమాళ్.. పోలీసు అధికారులు, సిబ్బందితో కలిసి తనిఖీలు నిర్వహించారు.
సికింద్రాబాద్ మారేడ్ పల్లికి చెందిన దంపతులకు పిల్లలు లేకపోవడంతో ఐవీఎఫ్ కోసం సికింద్రాబాద్ లోని సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్ ను ఆశ్రయించారు. అయితే, ఆమె భర్త నుంచి కాకుండా వేరే వ్యక్తి నుంచి వీర్యకణాలు సేకరించి పిండాన్ని వృద్ధి చేశారు. పుట్టిన బిడ్డకు రెండు సంవత్సరాల తర్వాత ఆరోగ్యం బాగా లేకపోవడంతో ఓ ఆస్పత్రిలో చికిత్స ఇప్పించారు. శిశువుకు క్యాన్సర్ ఉన్నట్లు వైద్య పరీక్షల్లో బయట పడింది. తమ వంశంలో ఎవరికీ క్యాన్సర్ లేదని, మళ్లీ ఒకసారి పూర్తిగా టెస్టులు చేయాలని బాధిత దంపతులు కోరగా.. డాక్టర్లు డీఎన్ఏ టెస్టు చేశారు.
బాబుకు, తండ్రి డీఎన్ఏకు సంబంధం లేదని టెస్టుల్లో తేలింది. దీంతో దిగ్ర్భాంతికి గురైన బాధిత దంపతులు.. గోపాలపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ ఆసుపత్రిలో శనివారం రోజంతా సోదాలు చేశారు. పేషెంట్ల ట్రీట్మెంట్కు సంబంధించిన ఫైల్స్ ను స్వాధీనం చేసుకున్నారు. సెంటర్ నిర్వాహకురాలు డాక్టర్ నమ్రతను అదుపులోకి తీసుకున్నారు. ఎంత మందికి వేరేవారి వీర్యంతో ఐవీఎఫ్ చేశారన్న కోణంలో దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు తెలిసింది. దర్యాప్తు చేసిన తర్వాత పూర్తి వివరాలను వెల్లడిస్తామని నార్త్ జోన్ డీసీపీ రష్మీ పెరుమాళ్తెలిపారు.