
హైదరాబాద్సిటీ, వెలుగు: హైదరాబాద్ జిల్లాలో పనిచేస్తున్న జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల్లో ఫీజులో 50 శాతం రాయితీ కల్పించాలని హైదరాబాద్ డీఈఓ ఆర్.రోహిణి యాజమాన్యాలను కోరారు. దానికి సంబంధించిన ఉత్తర్వులను మంగళవారం ఆమె విడుదల చేశారు.
హైదరాబాద్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్ (హెచ్ యూజే –- టీడబ్ల్యూజేఎఫ్) అధ్యక్షుడు బి.అరుణ్ కుమార్, కార్యదర్శి బి.జగదీశ్వర్ విజ్ఞప్తికి ఆమె సానుకూలంగా స్పందించారు. రాయితీ విషయంలో డిప్యూటీ ఈవోలు, డిప్యూటీ ఐఓఎస్(ఎంఈవో)లు తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఉత్తర్వులు జారీ చేయడంపై డీఈవో రోహిణి కి హెచ్ యూజే -టీడబ్ల్యూజేఎఫ్ అధ్యక్షులు అరుణ్ కుమార్, కార్యదర్శి జగదీశ్వర్ కృతజ్ఞతలు తెలిపారు.