
- ప్రైవేటు వ్యక్తుల హక్కుకు ఆధారాల్లేవు: హైకోర్టు
హైదరాబాద్, వెలుగు: రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం కొండాపూర్లో వేల కోట్ల రూపాయల విలువ చేసే 57 ఎకరాల భూములు ప్రభుత్వానివేనని హైకోర్టు ఇటీవల తీర్పు చెప్పింది. కొండాపూర్ లో సర్వే నెం.59లోని 57.09 ఎకరాలు భూమి తమదే అనడానికి ఆధారాలు చూపడంలో ప్రైవేటు వ్యక్తులు విఫలమయ్యారని పేర్కొంది. కొండాపూర్ సర్వే నెం.59లో లావణి పట్టాల ద్వారా పొందిన భూమికి మ్యుటేషన్ చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని ప్రైవేటు వ్యక్తులు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో సింగిల్ జడ్జి మ్యుటేషన్ చేయాలని ఆదేశించగా.. ప్రభుత్వం అప్పీలు దాఖలు చేయడంతో సింగిల్ జడ్జి ఉత్తర్వులను రద్దు చేసి సివిల్ కోర్టును ఆశ్రయించాలని ఆదేశించింది.
ఈ వివాదంపై విచారించిన సివిల్ కోర్టు.. కొండాపూర్ భూములు ప్రైవేటు వ్యక్తులవేనని, వాటిని మ్యుటేషన్ చేయాలని ఆదేశించింది. సివిల్ కోర్టు తీర్పును సవాలు చేస్తూ ప్రభుత్వం పలు అప్పీళ్లు దాఖలు చేసింది. వీటిపై విచారించిన జస్టిస్ నగేశ్ భీమపాక తీర్పు వెలువరిస్తూ ఆ భూములు ప్రభుత్వానివేనంటూ సివిల్ కోర్టు ఉత్తర్వులను రద్దు చేశారు.