
- ట్రై కమిషనరేట్ల పరిధిలో 349 చోట్ల వరద ముప్పు
హైదరాబాద్ సిటీ, వెలుగు: మూడు రోజుల్లో మాన్సున్ టీమ్స్ రానున్నాయని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ తెలిపారు. వరదలు వస్తే రోడ్లపై నీరు చేరే ప్రాంతాల్లో తీసుకోవాల్సిన చర్యలపై మంగళవారం ట్రాఫిక్ జాయింట్ సీపీలు గజరావు భూపాల్, జోయిల్ డేవిస్, హైడ్రా అడిషనల్ డైరెక్టర్ వి.పాపారావుతో కలిసి సమావేశం నిర్వహించారు. రంగనాథ్ మాట్లాడుతూ ప్రస్తుతం 51 హైడ్రా డిజాస్టర్ రెస్పాన్స్ బృందాలు కొనసాగుతున్నాయని, వీటికి 150 మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్లు తోడవుతున్నాయన్నారు. సర్కిళ్ల వారీగా జీహెచ్ఎంసీ సిబ్బందితో కలిసి ఈ బృందాలు పని చేస్తాయన్నారు. వీటికి జలమండలి, ట్రాఫిక్, ఇరిగేషన్, విద్యుత్ శాఖలకు చెందిన సిబ్బంది కూడా తోడయితే.. వరద ముప్పు చాలావరకు తగ్గించవచ్చునన్నారు.
ముందుగా ఎక్కువగా సమస్య ఉన్న 50 ప్రాంతాల్లో శాశ్వత పరిష్కారానికి ప్రయత్నిస్తామన్నారు. వర్ష సమాచారంతో పాటు సమస్యల పరిష్కారానికి తీసుకునే చర్యలు సమన్వయంతో సాగేందుకు వీలుగా వాట్సాప్ గ్రూప్లను ఏర్పాటు చేయాలన్నారు. బ్రేక్ డౌన్ అవుతున్న వాహనాలను పక్కకు తీయడానికి కావాల్సిన వాహనాలను ప్రాంతాలవారీగా సమకూర్చుకోవాలని ట్రాఫిక్ విభాగం జాయింట్ సీపీలను కోరారు. ట్రై కమిషనరేట్పరిధిలో 349 చోట్ల వరద ముప్పు ఉందని గుర్తించామన్నారు. ఈ ప్రాంతాలకు దగ్గరలో చెరువులు, నాలాలు అనుసంధానమై ఉన్నాయా లేదా అనేది పరిశీలించాలన్నారు.
వరద కాలువలు ఎక్కడైనా కుంచించుకుపోయిన,పూడుకు పోయినా సమాచారం ఇస్తే పునరుద్ధరించడానికి చర్యలు తీసుకుంటామన్నారు. సికింద్రాబాద్ ప్యాట్నీ, చికోటి గార్డెన్స్, చింతలబస్తీల మీదుగా సాగే వరద కాలువలను విస్తరిస్తున్నామన్నారు. రోడ్లు నీట మునగకుండా చూడడమే అందరి లక్ష్యం కావాలన్నారు. 2 గంటల పాటు వర్షం పడితే మీటరు ఎత్తున నీరు చెరువుల్లో చేరుతోందని, ఈ నీళ్లు బయటకు వెళ్లాలంటే వారం రోజులు పడుతోందన్నారు. ఈ నేపథ్యంలో వరదను నివారించేందుకు చెరువుల నీటి మట్టంపైనా అధ్యయనం చేయాల్సిన
అవసరాన్ని నొక్కి చెప్పారు.
చెరువులు, నాలాల ఆక్రమణలపై ఫిర్యాదు చేయండిలా..
చెరువులు, నాలాల ఆక్రమణల సమాచారాన్ని హైడ్రాకు ఇవ్వాలని హైడ్రా అధికారులు సూచిస్తున్నారు. ఈ మేరకు మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఆక్రమణలను సంబంధించిన వివరాలు వాట్సాప్ నంబర్ 8712406899 కు ఫొటోలతో పాటు ప్రాంతాలను తెలియజేసే లొకేషన్ షేర్ చేయాలని కోరారు. అలాగే హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు నేరుగా 7207923085 నెంబర్ ద్వారా సమాచారం ఇవ్వొచ్చని తెలిపారు. అలాగే కమిషనర్ హైడ్రా పేరిట ఉండే ట్విట్టర్(ఎక్స్), ఇన్స్టాగ్రామ్, ఫేస్ బుక్ లో కూడా సమాచారం అందజేసేందుకు వీలుందన్నారు.
నగరంలో గొలుసుకట్టు చెరువుల పునరుద్ధరణకు హైడ్రా చర్యలు తీసుకుంటోంది. వర్షం పడితే వరద నీరు రహదారులు, నివాస ప్రాంతాలను ముంచెత్తకుండా నేరుగా చెరువుల్లోకి చేరేలా చర్యలు తీసుకుంటోంది. చెరువులు, నాలాలను పరిరక్షించడం ఎంతో అవసరమని అందరూ గ్రహించాలని సూచిస్తోంది. ఈ క్రమంలో ఫిర్యాదులను అవకాశమిచ్చింది.